– మణుగూరు, యాతాలకుంటకు మంత్రులు రాక
– సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో మంత్రులు పరిశీలన
నవతెలంగాణ-సత్తుపల్లి
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
మంత్రుల పర్యటన వివరాలు ఈ క్రింది విధంగా…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఉదయం 09:15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు ఉదయం 10:15 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ టేక్ పాయింట్కు 10:30 గంటలకు చేరుకొని ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.
అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తరువాత 11:50 గంటలకు మణుగూరు హెలిప్యాడ్కు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంటలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్కు మధ్యాహ్నం 12:15 గంటలకు చేరుకుంటారు. ఆ గ్రామ సమీపంలో జరుగుతున్న సీతారామ టన్నెల్ (సొరంగం) ను మధ్యాహ్నం 12:25 నుంచి 01:20 గంటల వరకు పరిశీలించి అధికారులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 01:30 యాతాలకుంట హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు బయలుదేరి, మధ్యాహ్నం 02:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
భద్రతా సిబ్బందికి ఆదేశాలు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ‘జెడ్’ కేటగిరీ భద్రత ఉన్నందున, పర్యటన ముగిసే వరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా గట్టి బందోబస్తు, రవాణా, వసతి, ప్రోటోకాల్ మర్యాదలు ఏర్పాటు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.



