– పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
– జిల్లా విద్యాశాఖ
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారీ రాజు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 65 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 13,154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో నిషేధిత వస్తువులు తీసుకురావడం పూర్తిగా నిషేధించబడింది. ముఖ్యంగా సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇయర్ ఫోన్లు వంటి వాటిని అనుమతించరు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని తెలిపారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో కేంద్రాల వద్ద అనవసరంగా గుమికూడరాదని, పరీక్షల నిర్వహణకు సహకరించాలని ప్రజలను కోరారు. పరీక్ష కేంద్రాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే ముందు తమ హాల్ టికెట్ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని, పరీక్ష సమయానికి కనీసం అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్ www.bse.telangana.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా జిల్లా కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని, కంట్రోల్ రూమ్ నంబర్ 9959670118 అని తెలిపారు. అన్ని శాఖల అధికారులు, పోలీసు శాఖ, పంచాయతీ రాజ్, మున్సిపల్ సిబ్బంది కలిసి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సహకరిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.



