గత పన్నెండేళ్లుగా సాగుతున్న నేటి ఈ బీజేపీ రామరాజ్య పాలనలో దేశ నాయకులు రూ.250 లక్షల కోట్లు అప్పుచేసి, దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా మళ్లించారట! దేశంలో నల్లధనం మూడు రెట్లు పెంచి తమ నిర్వాకం ప్రదర్శించుకున్నారట! 35 వేల కిలోల బంగారం అమ్మేసి దేశాన్ని ధనిక దేశంగా మార్చారట! 50లక్షల కోట్ల రుణమాఫీ కేవలం తమ గుజరాతీ మార్వాడీలకే చేయించారంటే మాటలా? 16 లక్షల కోట్ల లంచం ఎస్.బి.ఐ.- ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా తీసుకుని అవినీతిని అడ్రసు లేకుండా చేశారట! లక్షలాది కంపెనీలు మూతపడేలా చేసి, దేశాన్ని ప్రగతిపథంలో నిలబెట్టారట! ప్రభుత్వ పాఠశాలలెందుకని వేల సంఖ్యలో వాటిని మూసేయించి విద్యను కొనసాగిస్తున్నారట! నిరుద్యోగాన్ని దేశంలో అత్యధికంగా పెంచి, ప్రపంచస్థాయిలోనే మొదటి స్థానం దక్కించుకున్నారట! అలాగే తమ శక్తికొద్దీ పేదరికాన్ని పెంచి పోషిస్తున్నారు.
ఈ విషయం ఏ దేశ ప్రభుత్వం కూడా మన దేశ ప్రభుత్వంతో పోటీ పడలేదని ఘంటాపథంగా చెప్పొచ్చునట! డాలర్ కన్నా రూపాయి ఎంతగా పైకెగసిందో అందరికీ తెలిసిన విషయమే కదా? డాలర్ ఒక్కటయితే మన రూపాయలు 92 కంటే ఎక్కువ! భారత్ ధనికదేశమని రుజువు చేయడానికే మన పాలకులు అధిక ధరలు, అధిక పన్నులు విధించి రొమ్ము విరుచుకుంటున్నారు. దేశ పౌరుల సహనశీలత పెంచడానికే కదా జీఎస్టీలతో సొమ్ము దోపిడీ చేస్తున్నదీ? దేశ సంపదలను, వనరులను, సంస్థలను, అన్నింటినీ తమ గుజరాతీ కార్పోరేట్లకు దోచిపెట్టి ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిందీ ప్రభుత్వం? ఇలా నేటి ఆరెస్సెస్ – బీజేపీ ప్రభుత్వం సాధించిన ‘అధోగతి ప్రగతి’కి ఉదాహరణలు ఎన్నయినా చెప్పుకోవచ్చు. అంతా దేశం కోసం? ధర్మం కోసమే? అయ్య బాబోయ్!!
ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రీ, ముఖ్యమంత్రీ నిర్దోషులని కోర్టు వారిని విడుదల చేసింది. కేంద్ర సంస్థలయిన ఇడి, సిబిఐలను దుర్వినియోగం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక ఇప్పుడు ఎక్కడ ముఖం దాచుకుంటుందీ? శాస్త్రవేత్త, మెగసెసే అవార్డు విజేత సోనమ్ వాంగ్ చుక్ వీరి నిర్వాకం వల్లే అనవసరంగా జైల్లో గడుపుతున్నాడు. రామ్ రహీమ్ అనే వీరి మిత్రుడు ఒక రేపిస్ట్, పేరుకే జైలు శిక్ష అనుభవిస్తూ 40-40 రోజులు బెయిల్పై బయట తిరగనిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు న్యాయాన్ని అన్యాయమని ముద్రవేస్తారు. అన్యాయమే న్యాయమని ప్రకటిస్తున్నారు. బీహార్లో దేశ ప్రధాని ఎన్నికల ప్రసంగాలు విని వారి బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా ఇలా అన్నారు.
”మోడీ ఎన్నికల ప్రసంగాలు – ఆయన ఒక నిరక్షరాస్యుడనీ, వీధి భాష మాటాడే వ్యక్తి అని తెలియజేశాయి!” కర్నాటక అప్పు 5.5 లక్షల కోట్లు అనేది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమే కానీ, నరేంద్ర మోడీ ఈ దేశం అప్పు పదకొండేళ్లలో 400 శాతం పెంచాడు – ఇది మాత్రం చాలా తేలికగా తీసుకోవాల్సిన విషయమే! వేల ఏళ్ల నుండి ఈ దేశాన్ని పీడిస్తున్న బ్రాహ్మణిజం ఇప్పుడు రూపం మార్చుకుని, ఆరెస్సెస్ అనే వందతలల విషనాగులా తన ప్రభావం చూపుతూ ఉంది. నిజానికి బీజేపీవారు హిందూయిజాన్ని పాటించరు. తమ ఆత్మ న్యూనతా భావానికి అనేకరకాలుగా పేర్లు మార్చి పెట్టుకుంటారు. వాలంటైన్ డేని -మాతా పితా దివస్గా మార్చారు. క్రిస్మస్ను తులసి పూజా దివస్గా చేసుకున్నారు. బక్రీద్ను – జంతువులను రక్షించే దినంగా మలుచుకున్నారు. రామనవమి అంటే మసీదుల ముందు డోలు వాయిస్తూ డాన్సులు చేసే దినంగా మార్చుకున్నారు. వాళ్ల పండగలు వాళ్లు జరుపుకోరు. వేరేవాళ్లని జరుపుకోనివ్వరు. అదీ వాళ్ల ప్రత్యేకత!
”ఉత్తరప్రదేశ్ విద్వేష రాజకీయాలకు, నేర సామ్రాజ్యానికి కేంద్రంగా తయారైంది. ఇది రాష్ట్రానికి ప్రమాదకరం” – అని ఆ రాష్ట్రంలోని 104 మంది మాజీ ఐఏయస్లు, ఐపియస్లు కలిసి యు.పి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఉత్తరం రాశారు. వీళ్లంతా దేశద్రోహులని మరి ఆయన వీళ్లందరినీ జైళ్లలో వేయిస్తాడేమోచూడాలి! 2026 జనవరి 6న జమ్మూ కశ్మీర్లోని రేసి జిల్లాలో ఉన్న శ్రీమాతా వైష్ణోదేవి మెడికల్ ఇనిస్టిట్యూట్ను (ఎస్ఎంవిడి ఎంఐ) బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాలు అల్లర్లు సృష్టించి మూసివేయించాయి. మూత పడ్డాక సంతోషంగా సంబరాలు కూడా జరుపుకు న్నాయి. విద్యాసంస్థ మూసేయించి సంబరాలు జరుపుకోవడం బహుశా ప్రపంచంలో ఇదే మొదటి ఉదంతమై ఉంటుంది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఈ చర్యను తీవ్రంగా నిరసించాడు. అక్కడ అసలు కారణమే మంటే- ముస్లిం విద్యార్థులే అందులో అధికంగా మెడికల్ సీట్లు సంపాయిస్తున్నారట.
మెరిట్లో నిలవలేని బీజేపీ అనుబంధ యువకులు సీట్లు తమకు రావడం లేదని నిరంతరం అల్లర్లు సృష్టించడం ప్రారంభించారు. చివరకు విజయవంతంగా మూయించి పండగ చేసుకున్నారు. ఎలాగైతేనేం ముస్లిం వర్గాన్ని దెబ్బతీశారు కదా? అదీ వారి ఘనత! ముస్లిం విద్యార్థులు ప్రతిభావంతులైనా దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు. ఉన్న ఊళ్లో మెడికల్ కాలేజి ఉన్నపళంగా మూతపడడం వల్ల ప్రతిభగల విద్యార్థులంతా ఇబ్బందుల్లో పడ్డారు. అల్లర్లు సృష్టించిన బీజేపీ,ఆరెస్సెస్ అనుబంధ విద్యార్థులకు ఇబ్బంది లేదు. వారు జైశ్రీరామ్ నినాదంతో ఎక్కడైనా, ఎవరినైనా బెదిరించి బతకగలరు. ఏమైనా వారు చేసేదంతా దేశం కోసం- ధర్మం కోసమే కదా? ఫామ్హౌస్లో మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్న మేఘాలయ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మారక్ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆ ఫామ్హౌస్లో ఉన్న ఐదుగురు మైనర్ బాలికలను కాపాడి, 73 మందిని అరెస్ట్ చేసి, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. దేశంకోసం- ధర్మం కోసం! మొత్తానికి మొత్తంగా హిందూ పవిత్ర గ్రంథాలన్నీ తీసి చదవండి.
ఎక్కడా ఎప్పుడూ ఏ రాక్షసుడూ బలత్కారం చేయలేదు. ఇప్పటిదాకా ఆ విషయం గమనించకపోతే- ఇక ఇప్పుడైనా తిరగేసి తెలుసుకోండి! ఇక దేవతల సంగతి చెప్పేదేముందీ? స్వంత బిడ్డల్నే వదిలిపెట్టలేదు. పైగా పదహారువేల మందితో రాసక్రీడలాడాడని ఆరాధిస్తున్నారు కదా? ఆ దేవతల అడుగుజాడల్లో నడుస్తున్న ఈ కాలపు భక్తజనం ఇలా తమ ఆరాధ్య దేవతల్ని అనుసరిస్తున్నారన్న మాట! ”అణగారిన వర్గాల మహిళలను రేప్ చేస్తే పుణ్యం లభిస్తుందీ, తీర్థయాత్రలకు వెళితే లభించే ఫలితం లభిస్తుంది. అందుకే, వారు అనాగరికంగా, మోటుగా ఉన్నా అందంగా లేకపోయినా లైంగిక దాడులు జరుగుతున్నాయి” – అని అన్నాడు మధ్యప్రదేశ్కు చెందిన ఒక ఎమ్మెల్యే -ఫూల్సింగ్. దుర్మార్గంగా ఎవరు మాట్లాడినా మనం నిరసించాల్సిందే! ”ఆడపిల్ల పుడితే నష్టం – మగ పిల్లవాడు పుడితే లాభం” అనేది బీజేపీ మనువాద భావజాలం! ”రాజస్థాన్లో బీజేపీ బడ్జెట్ అంటే యవ్వనంలో మగబిడ్డ పుట్టినంత లాభదాయకమైంది.
గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆడపిల్ల పుట్టినంత నష్టదాయకమైంది!” అని అసెంబ్లీలో ప్రకటించారు. రాజకీయ పార్టీలు వారి రాజకీయాలేవో వారు మాట్లాడుకోవచ్చు. కానీ, అడపిల్ల పుట్టుకను తక్కువచేసి చూపడమెందుకూ? బీజేపీ నాయకులు వారి మనువాద భావజాలాన్ని ఎక్కడపడితే అక్కడ ప్రదర్శిస్తూనే ఉంటారు. మూర్ఖుణ్ణి ఎవరో వచ్చి ”మూర్ఖుడా!” అని పిలవాల్సిన పనిలేదట. వాడికివాడే తన నైజం బాహాటంగా ప్రదర్శించుకుంటాడట. 1919లో బ్రిటీష్ వాళ్లు కలకత్తా హైకోర్టులో బ్రాహ్మణుల్ని నాయమూర్తులుగా నియమించేవారు కాదు. కారణం ఏమంటే- బ్రాహ్మణులైన వారు చట్టపరమైన తీర్పులు ఇవ్వకుండా, కులం ఆధారంగా నిర్ణయాలు తీసుకునీ, తీర్పులిస్తారని బ్రిటీష్ వారికొక అభిప్రాయ ముండేదట. ఆ అభిప్రాయానికి బలం చేకూర్చే ప్రకటనే ఇటీవల ఒక దేశ నాయకుడు చేశాడు.
”ఈ రోజు కాకపోతే రేపు భారతదేశం హిందూ దేశమైపోతుంది. అనుమానమే లేదు – అయితే అప్పుడు రాజ్యాంగంలో మొదటి సూత్రం ఇలా ఉంటుంది – వేద వేదాంగ పారంగతుడైన వాడికే న్యాయమూర్తిగా అక్కడ కూర్చుని తీర్పులిచ్చే అర్హత ఉంటుంది!”- అశ్వమిత్ గౌతమ్ అనే పద్నాలుగేళ్ల బాలుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చేసిన తప్పేమిటంటే, ఇన్స్టాగ్రామ్ వీడియోలో అతను ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాడు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సామాజిక అంశాల్ని లేవనెత్తాడు. అంతే!! ప్రశ్నకు వణికిపోయే ఈ ప్రభుత్వం, ఒక బాలుడికి కూడా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అవసరమా? అని అనుకుంది. అందుకే ఎఫ్ఐఆర్ దాకా పోయింది.
ఎవరైనా సరే, బాల్య దశలో ఉన్న బాలికలను లైంగిక వేధింపులకు గురిచేస్తే చైనాలో మరణశిక్ష విధిస్తారు. జిన్పింగ్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన విధానం అది. మరి మన దేశంలో తమది సనాతన ధర్మ మని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నాయకులే బాలికల్ని లైంగికంగా వేధిస్తున్నారు. ప్రజలు తిరగబడితే, మళ్లీ వారి కార్యకర్తలే రోడ్లెక్కి తమ నాయకుల్ని విడిచి పెట్టాల్సిందేనని ఊరేగింపులు తీస్తుంటారు. ముస్లింల రంజాన్ పండగ సందర్భంగా వారి అత్యవసర వస్తువులపై సుంకాలు మొత్తానికి మొత్తంగా ఎత్తేసింది-చైనా ప్రభుత్వం. మరి మనదేశం? ద్వేష భావనలు పెంచి పోషిస్తూ, ఎక్కడికక్కడ వారిపై దాడులు చేసే పనిలో తలమునకలై ఉంది.
సిక్కుమతానికి చెందిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ముస్లిం మతానికి చెందిన డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతి, అదే మతానికి చెందిన హమీద్ అన్సారీ ఉప రాష్ట్రపతి. అప్పటి రక్షణమంత్రి క్రైస్తవ మతస్తుడైన ఆంటోనీ. ఆ రోజుల్లో ఏ మతానికి చెందిన దేవుళ్లుగానీ, దేశపౌరులు గానీ ప్రమాదంలో లేరు. హిందూ దేవాలయాలు ప్రమాదంలో లేవు. హిందువులు అసలే ప్రమాదంలో లేరు. కానీ, గత పన్నెండేళ్లుగా హిందూ ప్రధాని, హిందూ హోంమంత్రి, హిందూ రాష్ట్రపతి, హిందూ ఉప రాష్ట్రపతి, హిందూ రక్షణ మంత్రి, హిందూ ముఖమంత్రులు, గవర్నర్లు- అయినా కూడా మరెందుకో ”హిందువులు ప్రమాదంలో ఉన్నారు” అనే ప్రచారం విస్తృతంగా జరుగుతూ ఉంది. హిందూ మతోన్మాదుల దుష్ప్రచారం అలాగే ఉంటుందని వదిలేయలేం! ఈ దేశ పౌరులే పూనుకుని-విద్వేష ప్రచారాల నుండి దేశాన్ని కాపాడాలి! మత కొట్లాటల నుండి దేశాన్ని కాపాడాలి! ఒక సముదాయాన్ని టార్గెట్ చేయడం నుండి దేశాన్ని కాపాడాలి.
కార్పొరేట్ల కబంధ హస్తాల నుండి దేశాన్ని కాపాడాలి! ఎక్కడా, ఎందులోనూ లొంగిపోకుండా అమ్ముడు పోకుండా దేశాన్ని కాపాడాలి!! దేశ నాయకులు ఎవరి వెంట ఉన్నారో వారి వికాసమే చూసుకుంటున్నారు గనక- ఇక ”సబ్ కసాత్! సబ్క వికాస్!!” నినాదం మానెయండని చెప్పాలి! దేశం కోసం ధర్మం కోసం-ఇక చెప్పక తప్పదు – సరే, ఇప్పుడు ప్రపంచం యుద్ధంలో మునిగి ఉంది. ట్రంప్, నెతన్యాహూ దేశాధినేతలుగా కాకుండా, అంతర్జాతీయ గూండాలు గా వ్యవహరిస్తున్నారు. సార్వభౌమాధికారం గల ఇతర స్వతంత్ర దేశాల అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుని దాదులు చేయడం ఏం న్యాయం? ఇక, భారత్-ఇరాన్ల మధ్య సంబంధం వేల ఏళ్ల నాటిది. అన్నింటినీ పక్కకు నెట్టి తన స్వార్థ ప్రయోజనాల కోసం.. దేశాన్నీ, దేశ పౌరుల భవిష్యత్తునీ ట్రంప్కు నజరానాగా సమర్పించి, గులాంగిరి చేస్తున్న మోడీని చారిత్రక ఉత్తమ మూర్ఖప్రధానిగా గుర్తించినా పరవాలేదని అనుకుంటున్నారా మన దేశ పాలకులు???
నేషనల్ బుక్ ట్రస్ట్ పూర్వ సలహా సంఘ సభ్యులు, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు



