Sunday, March 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగృహ అవసరాలకు ఇబ్బంది లేదు

గృహ అవసరాలకు ఇబ్బంది లేదు

- Advertisement -

కమర్షియల్‌ సిలిండర్లకు మాత్రమే కొరత
బ్లాక్‌ మార్కెట్‌ చేస్తే కఠిన చర్యలు
డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి ఉత్తమ్‌ భేటీ
ఓవర్‌లోడ్‌ వల్ల బుకింగ్స్‌ కాలేదు : డిస్ట్రిబ్యూటర్లు
అన్ని వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ : స్టీఫెన్‌ రవీంద్ర

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణలో గృహ వినియోగదారులకు గ్యాస్‌ కొరత లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల కొరత మాత్రమే ఉందని తెలిపారు. బ్లాక్‌ మార్కెట్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, అవసరం లేకున్నా ముందుగా గ్యాస్‌ బుక్‌ చేసుకోవద్దని సూచించారు. ఉద్దేశపూర్వకంగా గ్యాస్‌ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో గ్యాస్‌ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి సమావేశమయ్యారు. గ్యాస్‌ కొరతపై సమీక్షించారు. కస్టమర్లకు బుకింగ్‌ కావడం లేదని మంత్రి ప్రశ్నించగా.. ఓవర్‌ లోడ్‌ వల్ల బుకింగ్స్‌ కావడం లేదంటూ డిస్ట్రిబ్యూటర్లు సమాధానమిచ్చారు.

ఆయిల్‌ కంపెనీల సమ్మె వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయని వివరించారు. రాష్ట్రంలో 810 మంది ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారనీ, 1.3 కోట్ల గృహ వినియోగదారులు ఉన్నారని తెలిపారు. 7.5 లక్షల కమర్షియల్‌ సిలిండర్ల వినియోగదారులు ఉన్నారని చెప్పారు. నెలకు సగటున 60లక్షల సిలిండర్లను వినియోగిస్తున్నారని తెలిపారు. కమర్షియల్‌ సిలిండర్ల కొరత ఏర్పడిందన్నారు. గృహ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రతి రోజు 2.15 లక్షల ఎల్పీజీ డొమెస్టిక్‌ సిలిండర్లు సరఫరా చేస్తామన్నారు. రెండురోజులుగా 2.3 లక్షల సిలిండర్లు సరఫరా చేసినట్టు తెలిపారు. సివిల్‌ సప్లై భవన్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని అన్నారు. ఎవరైనా కృత్రిమ గ్యాస్‌ కొరత సృష్టించినా, బ్లాక్‌ మార్కెట్‌ చేసినా హెల్ఫ్‌ లైన్‌ 180042500344కు కాల్‌ చేయాలని కోరారు.

కమర్షియల్‌ సిలిండర్ల కొరత
రాష్ట్రంలో కమర్షియల్‌ సిలిండర్ల కొరత మాత్రమే ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రతి రోజు 23వేల సిలిండర్లు సరఫరా కావాల్సి ఉండగా, కేవలం 6,200 మాత్రమే సరఫరా అవవుతున్నాయని చెప్పారు. దీని ప్రకారం 20శాతమే వస్తున్నాయని తెలిపారు. అందులో పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, ప్రభుత్వ సంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి తాను లేఖ రాసినట్టు వివరించారు.

పర్యవేక్షణ కోసం 24/7 కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌
రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ పంపిణీని పర్యవేక్షించేందుకు 24/7 కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పని చేస్తున్నదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఎం. స్టీఫెన్‌ రవీంద్ర చెప్పారు. ముడి చమురు, ఎల్పీజీ సరఫరా అంతరాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా గ్యాస్‌ కొరత ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని వాహనాలకు రియల్‌-టైమ్‌ జీపీఎస్‌ ట్రాకింగ్‌ను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ట్రాకింగ్‌ చేస్తున్న తీరును ఆయన మీడియాకు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -