పాత కక్షల నేపథ్యంలో కత్తితో దాడి
పరారీలో నిందితుడు
పోలీసులు నన్ను పట్టుకోలేరంటూ
ఇన్స్టాగ్రామ్ లైవ్లో సవాల్
నవతెలంగాణ-మీర్ పేట్
పాత కక్షల నేపథ్యంలో అర్ధరాత్రి నడిరోడ్డుపై రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. కత్తితో పొడిచి దుండగుడు పరారయ్యాడు. అనంతరం నిందితుడు ఇన్స్టాగ్రామ్ లైవ్లోకొచ్చి.. పోలీసులు తనను పట్టుకోలేరంటూ సవాల్ విసరడం సంచలనంగా మారింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని నందనవనంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ వెంకటేశ్వర కాలనీకి చెందిన దాసరి సురేందర్ అలియాస్ సూరి 2022లో ఓ మహిళను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత భార్యపై అనుమానంతో ఆమెను సూరి చంపేశాడు. అందుకు భార్య అన్న సూరిపై దాడి చేశాడు. దాంతో సూరి తన బామ్మర్ది సల్మాన్ను కూడా 2024లో హత్య చేశాడు. అలా భార్య, బామ్మర్ది హత్య కేసుల్లో అతనిపై వరంగల్, హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతనిపై నగర బహిష్కరణ కూడా అమల్లో ఉన్నట్టు సమాచారం. అనంతరం అతను రెండో పెండ్లి చేసుకుని తల్లి, భార్యతో కలిసి ఉంటున్నాడు.
ఇదిలా ఉండగా, సల్మాన్ హత్యకు ప్రతీకారంగా అతని సోదరుడు అఫ్రోజ్ చాలాకాలంగా సూరిపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. సూరి తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకలకు నందనవనానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న అఫ్రోజ్ స్నేహితులతో కలిసి మంగళవారం అక్కడికి చేరుకున్నాడు. అర్ధరాత్రి నడి రోడ్డుపైనే సూరి కండ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సూరిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సూరి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మీర్పేట్ పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
నన్ను పట్టుకోలేరు.. పోలీసులకు నిందితుడి ఛాలెంజ్
హత్య అనంతరం నిందితుడు అఫ్రోజ్ తన ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి పోలీసులు తనను పట్టుకోలేరని ఛాలెంజ్ విసిరాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.
మీర్పేట్లో రౌడీ షీటర్ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



