Thursday, July 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం​ సర్ తో ఓట్లు తొలగించే కుట్ర

​ సర్ తో ఓట్లు తొలగించే కుట్ర

- Advertisement -

కొడంగల్‌ ‌కాంగ్రెస్‌ పార్టీ బీఎల్‌ఏల సమావేశంలో సీఎం రేవంత్‌‌రెడ్డి
​ప్రతి ఓటూ నమోదు చేయాలి
బూత్ లెవల్ ఏజెంట్లే కీలకం
కొడంగల్ నియోజకవర్గంలో 78 శాతం ఓట్ల నమోదు
​సర్ నమోదు ఆందోళనకరం
ప్రభుత్వ పాలనలో నిమగ్నమై ఉంటే.. కొందరు కుట్ర చేస్తున్నారు : కొడంగల్‌ ‌కాంగ్రెస్‌ పార్టీ బీఎల్‌ఏల సమావేశంలో సీఎం రేవంత్‌‌రెడ్డి


​నవతెలంగాణ-కొడంగల్

‘సర్’ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లు తొలగించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతి ఓటూ నమోదు చేయాలని, ఇందులో బూత్‌ ‌లెవల్‌ ఏజెంట్లే కీలకమని స్పష్టం చేశారు. బుధవారం వికారాబాద్‌‌ జిల్లా కొడంగల్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ‘సర్’ పత్రంలో తన వివరాలు నమోదు చేసి బీఎల్ఓకు అందజేశారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ బీఎల్‌ఏలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో రేవంత్ రెడ్డి అడ్డంకిగా మారాడని, తప్పులను అడగకుండా ఉండాలంటే కొడంగల్‌‌లో దెబ్బతీయాలని బీఆర్ఎస్, బీజేపీ కుట్ర పన్నుతున్నాయన్నారు. ‌బీజేపీ, బీఆర్ఎస్ పేర్లు వేరై ఉండొచ్చు కానీ లక్ష్యం మాత్రం ఒకటేనని తెలిపారు. కొడంగల్‌‌లో రేవంత్ రెడ్డికి ఎదురు నిలబడి గెలవబోమనే.. సర్‌‌తో దొంగ దెబ్బ తీయాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 119 నియోజకవర్గాల్లో నాలుగు కోట్ల ప్రజల అభ్యున్నతి కోసం 18 గంటలు పని చేస్తుంటే.. ఓర్చుకోవడం లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటూ నమోదు చేసుకునేలా పనిచేయాలని తెలిపారు.

ఎన్నికల కమిషన్ సర్ గడువును ఆగస్టు 3 వరకు పెంచిందని, దీన్ని ఉపయోగించుకుని 100 శాతం ఓట్లు నమోదయ్యేలా కృషి చేయాలని అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 78 శాతం నమోదు పూర్తైందని, ఇంకా 22శాతం పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. ఇవి నమోదు చేసుకోకపోతే ఆ ఓట్లను తొలగించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. పూర్తి చేయని వారందరితో నమోదు చేయించాల్సిన బాధ్యత బీఎల్‌ఏలపై, మనందరిపై ఉందని కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఇంటికి కార్యకర్తలు వెళ్లి ఓటరు నమోదు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ గుర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్‌ కల్వ సుజాత, మున్సిపల్ మాజీ చైర్మెన్ జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌‌ముఖ్, మున్సిపల్ చైర్మెన్ నందారం ప్రశాంత్, మార్కెట్ కమిటీ చైర్మెన్ అంబయ్య గౌడ్, టీపీసీసీ ప్రతినిధి ఎండీ యూసుఫ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -