ఐక్య ఉద్యమాలను బలోపేతం చేద్దాం : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య
సీఐటీయూ నల్లగొండ జిల్లా 13వ మహాసభ ముగింపు
నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షకార్యదర్శులుగా తుమ్మల వీరారెడ్డి, ఎండీ సలీం
నవతెలంగాణ – నల్లగొండ టౌన్
కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సీఐటీయూ 13వ జిల్లా మహాసభ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాల వల్ల కార్మిక వర్గానికి అందుతున్న కొద్దిపాటి ప్రయోజనాలను కూడా దూరం చేయడానికి కార్పొరేట్లకు ప్రయోజనాలు కలిగించేందుకు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరున లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని అన్నారు.
లేబర్ కోడ్ రద్దు చేయాలని 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భారత కార్మిక వర్గం గత ఐదు సంవత్సరాలుగా అనేక ఆందోళన పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. లేబర్ కోడ్లను తమ రాష్ట్రాల్లో అమలు చేయమని కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానాలు చేశాయన్నారు. తెలంగాణలోనూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ఇండస్ట్రియల్ డిస్ప్లే యాక్ట్, 1947 ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ యాక్ట్ కలిపి సంఘం పెట్టుకునే హక్కు మీద దాడి చేస్తున్నారన్నారు. 1926లో బ్రిటిష్ కాలంలో సాధించుకున్న కార్మిక హక్కులను వంద సంవత్సరాల తర్వాత మోడీ ప్రభుత్వం హరించి వేయడం అన్యాయమన్నారు.
300 మంది లోపు కార్మికులున్న పరిశ్రమల లే ఆఫ్, లాకౌట్కు ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా చేయడం, ఐరన్ ఫైర్ సిస్టం ప్రకారం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ సిస్టం తీసుకురావడం ఉద్యోగ భద్రతకు స్వస్తి పలకడమేనని తెలిపారు. కార్మిక హక్కుల రక్షణ కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం 55 మందితో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, లక్ష్మీనారాయణ, ఎండీ సలీం, డబ్బికార్ మల్లేష్, దండంపల్లి సత్తయ్య, అవుట రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా నూతన కార్యవర్గం
సీఐటీయూ జిల్లా అధ్యక్షులుగా తుమ్మల వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎండీ సలీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా బి.ప్రమీల, ఉపాధ్యక్షులుగా డబ్బికారు మల్లేష్, చినపాక లక్ష్మీనారాయణ, అవుత సైదులు, దండంపల్లి సత్తయ్య, లకపాక రాజు, మల్లు గౌతమ్ రెడ్డి, చింతపల్లి బయన్న, సహాయ కార్యదర్శులుగా నల్ల వెంకటయ్య, ఏర్పుల యాదయ్య, పెంజెర్ల సైదులు, అవుట రవీందర్, వల్లపు దాసు భూలక్ష్మి, డి.రవి నాయక్, ఎస్కే బషీర్ ఎన్నికయ్యారు. మరో 38 మంది కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.



