నవతెలంగాణ-రాయికల్: మండలంలో మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని,ఇందులో భాగంగా రూ.70 లక్షల వ్యయంతో పలు గ్రామాల్లో మహిళా సంఘ భవనాల నిర్మాణాలకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపనలు చేశారు.మండలంలోని కిష్టంపేట గ్రామంలో రూ.20 లక్షలతో రెండు భవనాలు,భూపతిపూర్లో రూ.20 లక్షలతో రెండు భవనాలు, వడ్డెలింగాపూర్లో రూ.10 లక్షలతో ఒకటి,వడ్డెరకాలనీలో రూ.10 లక్షలతో ఒకటి,చెర్లకొండాపూర్లో రూ.10 లక్షలతో ఒక మహిళా సంఘ భవనం నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…జగిత్యాల నియోజకవర్గంలో 60కి పైగా మహిళా సంఘ భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.మహిళలకు రూ.1300 కోట్ల బ్యాంకు వడ్డీని ప్రభుత్వం భరించిందని,200 యూనిట్ల ఉచిత విద్యుత్,సన్న బియ్యం,రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతోందన్నారు.
అదేవిధంగా ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు.జగిత్యాలలో అధిక సంఖ్యలో పల్లె దవాఖానాలు మంజూరయ్యాయని,రూ.235 కోట్ల వ్యయంతో 450 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం లభించిందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు మంజూరయ్యాయని, అందులో జగిత్యాల జిల్లాకు 3500 ఇళ్లు, రాయికల్ మండలానికి 911 ఇళ్లు కేటాయించబడినట్లు చెప్పారు.రైతు భరోసా,రుణ మాఫీ,వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
టాటా కంపెనీతో కలిసి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ ఏర్పాటు ద్వారా యువత,మహిళలకు వృత్తి విద్యలో నైపుణ్యాలు పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.రాయికల్ పట్టణంలో రూ.7 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని,మండలంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని,పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున,ఎంపీఓ సుష్మ,ఏఈ సివి ప్రసాద్, ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి,సర్పంచులు ఆకుల అంజా గౌడ్,గుర్రం భావన,బండారి మానస,బోదాసు చంద్రశేఖర్,రవి,ఉప సర్పంచ్లు చాంద్ పాషా,సంజీవ్ చారి,బోదాసు రాజేష్,భూక్యా శంకర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.



