నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ నేత,లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రయాగ్రాజ్లో శనివారం నిర్వహించనున్న‘విద్యార్థుల గళం’ (ఛాత్రోన్ కీ గూంజ్) కార్యక్రమాన్ని యోగి ప్రభుత్వం అడ్డుకుంది. ఆ కార్యక్రమానికి గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు కాయస్థ పాఠశాల (కె.పి) ట్రస్ట్ పేర్కొంది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ వెల్లడించారు. ప్రయాగ్రాజ్లోని కె.పి.గ్రౌండ్లో జరగాల్సిన ఈ కార్యక్రమంలో పరీక్షా పత్రాల లీకేజీలు,విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ విద్యార్థులతో చర్చించాల్సి ఉంది.
అయితే వేదిక వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యం కాదని ట్రస్ట్ ప్రకటించింది. కె.పి.కాలేజీ మైదానాన్ని క్రీడలు,విద్యా సంబంధిత కార్యక్రమాలకు తప్ప ఇతర అవసరాలకు వినియోగించరాదని అలహాబాద్ హైకోర్టు గత ఏడాది ఆగస్టు14న ఆదేశించిందని ట్రస్ట్ తాత్కాలిక అధ్యక్షుడు జితేంద్ర నాథ్ చౌదరి తెలిపారు.వర్షం కారణంగా మైదానం పూర్తిగా నీటితో నిండిపోయిందని,బహిరంగ సభ నిర్వహించడం సురక్షితం కాదన్నారు.కాంగ్రెస్కు ఇచ్చిన అనుమతి కూడా జిల్లా మేజిస్ట్రేట్ ఆమోదానికి లోబడి ఉందని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. ‘‘ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్ కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, అలాంటి కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమని అన్నారు.


