జయంతి కార్యక్రమంలో వక్తలు
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ ఉద్యమానికి వైచారిక మార్గదర్శి ప్రొ. జయశంకర్ అని పలువురు వక్తలు కొనియాడారు. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించారు. పలువురు ప్రముఖులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డిమాట్లాడుతూ.. తెలంగాణ భావజాల వ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ ప్రజల గుండెల్లో ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా, తెలంగాణ సిద్ధాంతకర్తగా చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సేవలు, అందించిన మార్గదర్శకత్వం చిరస్మరణీయమని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లో విస్తృతంగా చాటడంలోనూ, మలిదశ ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేయడంలోనూ ఆయన పాత్ర అపూర్వమని స్మరించుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తెలంగాణ ఉద్యమ గీతాలను ఆలపించి సభికులను అలరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరామ్, ఎల్.రమణ, తకెళ్లపల్లి రవీందర్రావు, అంజిరెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, భాషా సాంస్కృతిక శాఖ ఇన్చార్జి సహాయ సంచాలకులు పి.నర్సింలు, ఏఓ డా. పి. విజయకుమార్, సలహామండలి సభ్యులు దినకర్, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి ప్రొ. జయశంకర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



