నవతెలంగాణ – మందమర్రి: మండలంలోని తిమ్మాపూర్లో గల గ్రీన్వుడ్ సీబీఎస్ఈ పాఠశాలలో శుక్రవారం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను నిర్వహించినట్లు పాఠశాల డైరెక్టర్ డాక్టర్ భరద్వాజ నాయుడు, ఏజీఎం పవన్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రమోహన్ మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుని వాటిని పరిరక్షించే బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు.
వేడుకల్లో భాగంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి బోనం, పోతురాజు వేషధారణలతో ఆకట్టుకున్నారు. జానపద నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి అలరించారు. విద్యార్థుల ప్రదర్శనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో హెడ్మిస్ట్రెస్ క్రిస్టినా, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి, ఏవో ఖుద్దూస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.




