నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో, అధికార ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తమ అభ్యర్థుల పూర్తి జాబితాను ప్రకటించి ఎన్నికల సమరానికి సర్వసన్నద్ధమైంది. రాష్ట్రంలో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. శుక్రవారం విడుదల చేసిన ఈ జాబితా ప్రకారం, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సిట్టింగ్ స్థానమైన కోలత్తూరు నుంచే మరోసారి పోటీ చేయనున్నారు. ఆయన కుమారుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని చేపాక్-ట్రిప్లికేన్ నుంచి తిరిగి బరిలోకి దిగుతున్నారు.
ఈ ఎన్నికల్లో కీలక రాజకీయ పరిణామంగా, ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరణకు గురై డీఎంకే కూటమితో చేతులు కలిపిన సీనియర్ నేత ఓ. పన్నీర్సెల్వం తేని జిల్లాలోని బోడినాయకనూర్ నుంచి పోటీ చేయనున్నారు. గతంలో ఆయన ఈ నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలుపొందారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను డీఎంకే 164 చోట్ల పోటీ చేస్తుండగా, మిగిలిన 70 సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది. పార్టీ సీనియర్లు, మంత్రులైన దురైమురుగన్, కేఎన్ నెహ్రూ, అన్బిల్ మహేశ్, సెంథిల్ బాలాజీ వంటి చాలా మందికి వారి సిట్టింగ్ స్థానాలనే మళ్లీ కేటాయించారు. అయితే, పొత్తులో భాగంగా మంత్రి మనో తంగరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పద్మనాభపురం సీటును కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు.



