డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేశ్, ఆనగంటి వెంకటేశ్
యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్), కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త పిలుపులో సోమవారం తలపెట్టిన జైల్భరో కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేశ్, ఆనగంటి వెంకటేశ్ ప్రకటించారు. ఈ పిలుపులో యువత అత్యధికంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, కార్మికులు, ప్రజల జీవనోపాధి, హక్కులను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఐక్య పోరాటానికి జైల్భరో ప్రతీక అని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సూచించినట్టుగా సీటూ+50 శాతం నిర్ణయించి పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధ హామీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్లను, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, ప్రయివేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రైతుల రుణమాఫీ, గిరిజనుల భూహక్కులకు రక్షణ, యువతకు ఉద్యోగ భద్రత, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సామాజిక భద్రత, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలనే డిమాండ్తో జరుగుతున్న జైల్భరోలో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ అవకాశాలు, సామాజిక భద్రత, ప్రజా సంస్థలు వ్యవస్థాగతంగా బలహీనపడుతున్న వేళ యువత ప్రేక్షకులుగా మిగలొద్దని విన్నవించారు.



