ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
నవతెలంగాణ – ముధోల్
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా దశలవారీగా సమస్యలను పరిష్కరానికి కృషి చేస్తానని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ తండా, ఎడ్బిడ్ గ్రామాల్లో సుమారు రూ.కోటి నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఎడ్బిడ్ తండాలో రూ.32 లక్షల నిధులతో నిర్మించనున్న జగదాంబ మాత, సేవాలాల్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అలాగే రూ.40 లక్షలతో చేపట్టనున్న గ్రామపంచాయతీ భవనం, మహిళా సమైక్య భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎడ్బిడ్ గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న గోదాం నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.
ముధోల్ మండలంలో రహదారుల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గత పదేళ్లుగా ఇళ్ల మంజూరు కాక ప్రజలు ఇబ్బందులు పడిన విషయం వాస్తవమేనని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత మూడేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చామని, రానున్న రెండేళ్లలో నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేలా మరిన్ని పనులు చేపడతామని అన్నారు
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వచ్చిన ఎమ్మెల్యేకు ఎడ్బిడ్ తండా, ఎడ్బిడ్ గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళా సమైక్య భవనాల నిర్మాణం, ప్రారంభంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, సర్పంచ్లు రామచంద్రారెడ్డి , ధూమ నాయక్, ఉప సర్పంచ్లు భూమన్న, అంబర్ సింగ్, మాజీ సర్పంచులు నిమ్మ పోతన్న, స్వర్ణలత దత్తాద్రి, నాయకులు నర్సా గౌడ్ , రేఖాజి, అధికారులు, తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు.



