– మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
దేశ స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమని, అమరుల ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం బీఆర్ఎస్ అశ్వారావుపే మండల కమిటీ ఆధ్వర్యంలో రింగ్రోడ్డు సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తాటి వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.
ఈ సందర్భంగా భగత్సింగ్, అల్లూరి సీతారామరాజు, కొమురం భీం తదితర స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల సేవలను కొనియాడారు. అమరుల త్యాగాలను మరువకుండా దేశభక్తి, ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అశ్వారావుపేట మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
కార్యక్రమంలో కాసాని చంద్రమోహన్, మాజీ జడ్పీటీసీ అంకత మల్లికార్జునరావు,సత్యవరపు సంపూర్ణ, డాక్టర్ భూక్యా ప్రసాద్, భూక్యా ఉదయ జ్యోతి, జుజ్జురపు శ్రీరామ్ మూర్తి, కాసాని పద్మ, జక్కుల రాంబాబు, మోటూరి మోహన్, ఎస్కే ఆసిఫ్, శెట్టిపల్లి రఘురాం,తగరం జగన్నాథం, పాలవలస జీవన్రావు తదితరులు పాల్గొన్నారు.



