నవతెలంగాణ-హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడైన రాఘవ్ చద్దా (Raghav Chadha)పై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. 2023 నుంచి రాజ్యసభలో ఉప నేతగా ఉన్న ఆయనను ఆ పదవి నుంచి తొలగించింది. పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ను రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్గా ఆ పార్టీ నియమించింది. ఈ మార్పునకు సంబంధించి అధికారిక లేఖను రాజ్యసభ సచివాలయానికి ఆప్ పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే సభలో మాట్లాడటానికి రాఘవ్ చద్దాకు సమయం కేటాయించకూడదని కూడా ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.
అయితే రాఘవ్ చద్దా దీనిపై స్పందించలేదు. అలాగే పార్టీ కార్యాలయంలో కేజ్రీవాల్ ప్రసంగించిన సమావేశంతో పాటు జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘జనసభ’ వంటి కీలక పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాఘవ్ చద్దా పార్టీకి దూరంగా ఉంటున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజా చర్యతో ఆప్, ఆయన మధ్య విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తున్నది.



