నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమబెంగాల్లో ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించడం ఎన్నికలను అడ్డుకునేందుకు జరిగిన ఉద్దేశ్యపూర్వక చర్యగా సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించినట్లు తెలిపింది. పశ్చిమబెంగాల్లో ఉన్నటువంటి రాజకీయ ద్రువణత తాను ఎన్నడూ చూడలేదని సిజెఐ పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున 2.00గంటల వరకు తాను మేల్కోని, వివరాలు తెలుసుకుంటున్నానని అన్నారు. సీనియర్ పోలీస్ అధికారులు, పరిపాలనా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిపై భాద్యతాయుతమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణనివ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
మాల్డా జిల్లాలోని కాలియాచక్ సమీపంలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు అధికారులను బుధవారం మధ్యాహ్నం ఓమూక చట్టుముట్టి తొమ్మిదిగంటలకు పైగా నిర్భందించిన సంగతి తెలిసిందే. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో పోలీసులు, పారామిలటరీ బృందం వారిని రక్షించింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక అధికారులు బదిలీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
బెంగాల్లో ‘జంగిల్ రాజ్’ : ఇసిఐ
న్యాయాధికారులను నిర్బంధిస్తారని ఎవరూ ఊహించలేదని భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) తెలిపింది. పశ్చిమబెంగాల్లో జంగిల్ రాజ్ పాలన ఉందని మండిపడింది. ఎస్ఐఆర్ నిర్వహిస్తున్న న్యాయాధికారులకు, ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని న్యాయస్థానం ఇసిఐని ఆదేశించింది. న్యాయాధికారుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని హెచ్చరించింది. ఈ ఘటనపై సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తుకు ఇసిఐని అనుమతించినట్లు తెలిపింది.



