– రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-సత్తుపల్లి
విద్య వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, పేదలకు ఉచిత వైద్యం, నాణ్యమైన విద్య అందించడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం సత్తుపల్లిలో రూ.1.83 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్టీఆర్ నగర్లో రూ.1.43 కోట్లతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించారు.
శివసాయి నగర్లో రూ.40 లక్షలతో మున్సిపల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి భూమిపూజ చేశారు. కలెక్టర్ దివాకర టీఎస్తో కలసి పలు సమగ్ర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… పట్టణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఉచిత ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు హెల్త్ సెంటర్కు కావలసిన వైద్యాధికారులు, వైద్య సిబ్బంది నియామకానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణంతో శివసాయి నగర్ ప్రజల సామాజిక అవసరాలకు తీవ్ర ఊరట లభిస్తుందన్నారు.
వివాహాలు, శుభకార్యాలు, సామాజిక సమావేశాలకు కమ్యూనిటీ హాల్ ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.కార్యక్రమంలో దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పిన్రెడ్డి శ్రీనివాస రెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసచారి, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.



