మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్
నవతెలం-గాణ – పరకాల
సన్న వరి క్వింటాలుకు ప్రభుత్వం అందిస్తున్న రూ.500 బోనస్ పొందాలంటే రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే ఆన్లైన్ నమోదు పూర్తి చేసుకోవాలని పరకాల మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. బోనస్కు అర్హత కలిగిన సన్న వరి రకాలను సాగు చేసే రైతులు సమీపంలోని విత్తన విక్రయదారుడు లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు. బోనస్కు బిపిటి-5204 (సాంబ మసూరి), అర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), కెఎన్ఎం-1638 (కూనారం సన్నలు), వరంగల్-44 (సిద్ధి), కెఎన్ఎం-7715, హెచ్ఎంటి సోనా, జై శ్రీరామ్ రకాలు మాత్రమే అర్హమైనవని అధికారులు తెలిపారు.
విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు ఆధార్, పట్టాదారు పాస్బుక్ వివరాలను విత్తన విక్రయదారుడికి అందించి ప్రభుత్వ వెబ్సైట్లో నమోదు చేయించుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన విత్తన రకం, సరుకు సంఖ్యతో కూడిన ఆన్లైన్ రశీదును తప్పనిసరిగా పొందాలని పేర్కొన్నారు. సొంత విత్తనాలను వినియోగించే రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి నమోదు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. నాట్లు పూర్తయిన అనంతరం వ్యవసాయ విస్తరణ అధికారులు పొలాలను సందర్శించి పంట నమోదు నిర్వహిస్తారని, ఆ సమయంలో విత్తన నమోదు వివరాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. విత్తన విక్రయదారుడి వద్దగానీ, వ్యవసాయ విస్తరణ అధికారి వద్దగానీ ఆన్లైన్ నమోదు చేయించుకోని రైతులకు రూ.500 బోనస్ వర్తించదని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పరకాల మండలంలోని సన్న వరి సాగు చేసే రైతులు ఎలాంటి ఆలస్యం చేయకుండా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి విజ్ఞప్తి చేశారు.



