నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్థుల్లో గణిత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అశ్వారావుపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణిత విషయాంశ కాంప్లెక్స్ సమావేశాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాషా సామర్థ్యాలతో పాటు గణితంలోనూ విద్యార్థులు నైపుణ్యం సాధించేలా బోధన సాగించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులు గణితంలో రాణించేలా ఎలాంటి బోధనా పద్ధతులు అవలంబించాలనే అంశాలపై చర్చించేందుకు కాంప్లెక్స్ సమావేశాలు దోహదపడతాయని తెలిపారు. పర్ఫార్మెన్స్ ఇండికేటర్లలో సామర్థ్యాల సాధన పెంపునకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
సమావేశంలో గణిత బోధనాంశాలపై విపులంగా చర్చించారు. రిసోర్స్ పర్సన్లుగా సీహెచ్ నర్సింహారావు, జ్యోతి వ్యవహరించగా, కోర్సు డైరెక్టర్గా కొండలరావు వ్యవహరించారు. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



