నవతెలంగాణ – అశ్వారావుపేట
ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం అశ్వారావుపేట లో నిరుద్యోగ యువతతో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై బీఆర్ఎస్ చేపట్టిన పోరుబాట లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఉప్పల వెంకటరమణ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాల అభివృద్ధితో పాటు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు విద్యావకాశాలు మెరుగుపరిచామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ లోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు ఆ మేరకు ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగాలకు ప్రస్తుత ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసి, వాటిని తమ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు గా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించి, హామీలను అమలు చేయాలని కోరారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించడంతోపాటు యువత, విద్యార్థులకు సంబంధించిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.



