సిబిల్ తరహాలోనే గ్రామీణ్ క్రెడిట్ స్కోర్
ఆర్థికస్థితిని బట్టే బ్యాంకు రుణాలు
రాష్ట్రానికి కేంద్రం ప్రతిపాదన
పైలట్ ప్రాజెక్ట్గా రాష్ట్రంలో అమలుకు సన్నాహాలు
ఎస్ఎస్ఆర్ శాస్త్రి
రాష్ట్ర రైతాంగంపై కేంద్రం మరో బాంబు వేసింది. గ్రామీణుల ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేసేందుకు ‘సిబిల్’ తరహాలో గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ (జీసీఎస్)ను అమల్లోకి తేవాలని ప్రతిపాదించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) ద్వారా వచ్చిన ఈ ప్రతిపాదనపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని కొన్ని మండలాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) దీన్ని అమల్లోకి తెస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రణాళికాశాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 27వ తేదీ జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో డీఎఫ్ఎస్ డైరెక్టర్ మానసా గంగోత్రి కాటా ఈ ప్రతిపాదన చేశారు. దీనికోసం గ్రామీణ ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆ సమావేశానికి అప్పటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, వ్యవసాయశాఖ కార్యదర్శి కే సురేంద్రమోహన్, సెర్ప్ సీఈఓ డీ దివ్యతో పాటు పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తాజాగా ఇదే అంశంపై డీఎఫ్ఎస్ నుంచి రాష్ట్ర ఆర్థికశాఖకు ప్రతిపాదనలు చేరినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆర్థిక, ప్రణాళికా శాఖలు దీనిపై కసరత్తు చేస్తున్నాయి. కేంద్రప్రభుత్వం 2025-26 బడ్జెట్లో ‘గ్రామీణ్ క్రెడిట్ స్కోర్’ (జీసీఎస్) ప్రకటించింది. ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు కలిసి దీనికి సంబంధించిన విధి విధానాలు, ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తున్నాయి. గ్రామీణ రుణాల కోసం బ్యాంకర్లు ఈ స్కోర్ను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒకేసారి ఈ విధానాన్ని అమల్లోకి తెస్తే గ్రామీణ రైతాంగం నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. దానిలో భాగంగానే రాష్ట్రంలో జీసీఎస్ అమలుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది.
సిటీల్లో…
ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో ‘సిబిల్ స్కోర్’ లేకపోవడంతో జాతీయ బ్యాంకులు ప్రయివేటు ఉద్యోగులు సహా సామాన్య ప్రజలకు రుణాలు ఇవ్వట్లేదు. దీనితో వారంతా గత్యంతరం లేక ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీలను ఆశ్రయిస్తూ, అధిక వడ్డీలు చెల్లిస్తున్నారు. గృహ రుణం, ఎడ్యుకేషనల్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ ఇలా అన్ని రకాల రుణాలకు ఇదే విధానం అమల్లో ఉంది.
అమలు చేసేది వీరే..
జీసీఎస్ సహా గ్రామీణుల క్రెడిట్ అంచనా వ్యవస్థల నిర్వహణలో నాబార్డ్తో పాటు మైక్రోఫైనాన్స్ సంస్థలు, ఫిన్టెక్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలుస్తుంది. గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ అనేది కేవలం బ్యాంక్ రికార్డులపై ఆధారపడి ఉండదు. వ్యక్తి జీవన విధానం, ఆదాయం, సామాజిక నమ్మకం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
వీరందరిపై ఎఫెక్ట్
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ రుణాల కోసం ఈ స్కోర్ను ఉపయోగించాలని బ్యాంకులకు సూచించింది. ముఖ్యంగా కొత్తగా రుణం తీసుకునే గ్రామీణ వ్యక్తులు, స్వయం సహాయక బృంద సభ్యులు (ఎస్హెచ్జీ), రైతులు, చిన్న వ్యాపారులను అంచనా వేసేందుకు జీసీఎస్ను ఉపయోగిస్తారు. దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని ఇప్పటికే బ్యాంకర్లకు కేంద్రం ఉత్తర్వులు జారీచేసినట్టు సమాచారం. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా అన్ని బ్యాంకుల్లో ఒకే విధంగా అమలు చేయట్లేదు. దశలవారీ అమలుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కేంద్రం దీన్ని పాలసీగా తీసుకొచ్చిందని అధికారులు చెప్తున్నారు. పాక్షికంగా కొన్ని బ్యాంకులు, సంస్థలు దీన్ని అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
‘సిబిల్’ ప్రయివేటే…
ఆర్థికరంగంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (సిబిల్) స్కోర్కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అలాగని ఇదేదో ప్రభుత్వశాఖ అనుకుంటే పొరపాటే! ఇది ఫక్తు ప్రయివేటు కంపెనీ. 2016లో అమెరికాకు చెందిన గ్లోబల్ క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ అయిన ట్రాన్స్యూనియన్ సిబిల్లో 90 శాతానికి పైగా మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. దీనితో సిబిల్ ప్రయివేటు సంస్థగా మారింది. పేరు కూడా ట్రాన్స్యూనియన్ సిబిల్ లిమిటెడ్గా మార్చుకుంది. అయితే ఈ ప్రయివేటు సంస్థ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియంత్రణలో పనిచేస్తుంది. 2005 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల నియంత్రణ చట్టం ద్వారా నమోదైంది. బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుండి డేటాను సేకరించి, క్రెడిట్ రిపోర్టులు మరియు స్కోర్లను రూపొందించే క్రెడిట్ బ్యూరోగా పనిచేస్తుంది. కానీ ఈ సంస్థ స్వయంగా ఎలాంటి రుణాలను ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయదు. క్రెడిట్ స్కోర్ను బట్టి బ్యాంకర్లు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ను కూడా ఇలాగే విదేశీ ప్రయివేటు సంస్థలే నిర్వహిస్తాయని సమాచారం.
జీసీఎస్ అంటే..
గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ (జీసీఎస్) అంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారి ఆర్థిక స్థిరత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ప్రత్యేకమైన స్కోర్. అంటే ప్రస్తుతం నగరాల్లో బ్యాంకులు ఎవరికైనా రుణాలు ఇవ్వాలంటే క్రెడిట్ స్కోర్ను ప్రామాణికంగా తీసుకుంటాయి. దీన్ని ‘సిబిల్’ అందచేస్తుంది. ఈ స్కోర్లో ఉండే పాయింట్లను బట్టే సదరు వ్యక్తికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలో వద్దో నిర్ణయిస్తాయి. క్రెడిట్ స్కోర్ను బట్టే వడ్డీ రేట్లనూ నిర్ణయిస్తారు. స్కోర్ తక్కువ ఉంటే వడ్డీ రేటు పెరుగుతుంది. అలాగే ఈ స్కోర్ను బట్టే సదరు వ్యక్తికి అప్పులు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందో లేదో అంచనా వేస్తారు.
ఇలా లెక్కిస్తారు..
గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ గ్రామీణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి బ్యాంక్ లావాదేవీలు, సాధారణ రికార్డులు తక్కువగా ఉంటాయి. ఈ స్కోర్లో గ్రామీణ రైతాంగం యొక్క పంటల దిగుబడి, భూమి యాజమాన్యం, పశుసంపద, స్వయం సహాయక సంఘాల్లో (ఎస్హెచ్జీ) సభ్యత్వం, మైక్రోఫైనాన్స్ లోన్లు తిరిగి చెల్లించిన రికార్డ్, స్థానిక వ్యాపార ఆదాయం, ప్రభుత్వ పథకాల వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రభుత్వ ప్రచారం ఇలా
జీసీఎస్ అమల్లోకి వస్తే గ్రామీణ ప్రజలకు బ్యాంకులు సులభంగా రుణాలు ఇస్తాయని ప్రభుత్వం చెప్తున్నది. రుణం ప్రాసెస్ కూడా వేగంగా పూర్తవుతుందనీ, తక్కువ వడ్డీతో రుణాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు.
అసలు కత ఇదీ
గ్రామీణ రైతాంగానికి జాతీయ బ్యాంకులు ఇస్తున్న రుణాలను కుదించేందుకే కేంద్ర ప్రభుత్వం జీసీఎస్ను తెస్తున్నట్టు తెలుస్తుంది. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పథకాలను కుదించడమే దీనివెనుక ఉన్న ప్రధాన కారణం. గ్రామీణ రైతాంగం, ప్రజల జీవనం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. ఓ సీజన్లో పంటనష్టం జరిగి రైతు బ్యాంకు రుణం సకాలంలో చెల్లించలేకపోతే ఆ ఎఫెక్ట్ అతని ‘జీసీఎస్’పై పడుతుంది. క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. ఫలితంగా జాతీయ బ్యాంకులు సదరు రైతుకు రుణం ఇచ్చేందుకు సిద్ధపడవు. అదే సమయంలో ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తాయి. జీసీఎస్ లేదు కాబట్టి అధిక వడ్డీకి రుణాలు ఇస్తామని ప్రచారం చేస్తాయి. ఫలితంగా రైతులు తమ ఆర్థిక అవసరాల కోసం ప్రయివేటు ఫైనాన్స్ కంపెనీల ఉచ్చులోకి దిగబడతారు.



