నవతెలంగాణ- హైదరాబాద్, నాచారం
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఈఎస్ఐ రాష్ట్ర కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించగా, అన్ని పదవులకు ఏకగ్రీవంగా నాయకులను ఎన్నుకున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్, సీనియర్ వైద్యులు డాక్టర్ వెంకటేష్ బాబు తెలిపారు.రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ చీమ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ యు ఆదిత్య, కోశాధికారిగా డాక్టర్ గోలి విజయ్ కుమార్ ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులుగా డాక్టర్ దుర్గా పద్మజా, డాక్టర్ లోకేష్ ఎంపిక కాగా, జీసీ సభ్యులుగా డాక్టర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ రవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా డాక్టర్ రాచన్న ఎన్నికయ్యారు.
నూతన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, సీనియర్ వైద్యుడిని ఈఎస్ఐ డైరెక్టర్గా నియమించే దిశగా ప్రయత్నిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఈఎస్ఐసి రాష్ట్ర వ్యవస్థపై జరుగుతున్న అన్యాయాలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో మద్దతు తెలిపిన వైద్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.



