ఆగష్టు 15న ఎర్రకోటపై ప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ రైతులకు అనేక హామీలు గుప్పించారు. రైతులకు ఎదురయ్యే సమస్యలకు అడ్డుగోడగా నిలబడతానని చెప్పారు. వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తానని కూడా నమ్మబలికారు. తీరా 19న తారీఖున విదేశీ పత్తిపై ఉన్న దిగుమతి సుంకం తీసివేసి భారతీయ పత్తి రైతులను సంక్షోభంలోకి నెట్టివేశాడు. దీంతో ప్రతి సంవత్సరం 177 మిలియన్ డాలర్ల దిగుమతి అయ్యే పత్తి, ఈ ఏడాది 370 మిలియన్ డాలర్ల పత్తి దిగుమతి అయింది. అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్లతో జరిగిన వ్యవసాయ వాణిజ్య ఒప్పందాలతో రైతాంగం దిగాలు పడింది. భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై పద్దెనిమిది శాతం సుంకం ఉంటే ఇతర దేశాల నుంచి దిగుమతి వ్యవసాయ ఉత్పత్తులపై జీరో శాతం సుంకం ఉంది. దీంతో భారత దేశంలో దొరికే వ్యవసాయ ఉత్పత్తుల కంటే నాణ్యమైన విదేశీ ఉత్పత్తులు చౌకకు భారత మార్కెట్ను ముంచెత్తునున్నాయి. దీంతో పత్తి, మొక్కజొన్న, సోయా, పాడి, పౌల్ట్రీ రైతాంగం సంక్షోభాల సుడిగుండంలో కూరుకుపోయాయి. మాటలేమో రైతాంగానికి, చేతలేమో కార్పొరేటర్లకు అన్నట్టుగా మోడీ విధానం ఉంది.
కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పోరాడుతుంటే, పట్టించుకోకుండా కార్పొరేట్ అనుకూలమైన ఫసల్ బీమా విధానం తీసుకొచ్చింది మోడీ సర్కార్. విత్తన చట్టం ఉసురుతీస్తూ వచ్చిన నూతన విత్తన చట్టంలో విత్తన వ్యాపార సౌలభ్యానికి ఉన్న ప్రాధాన్యం వ్యవసాయంలో లేదు. ఉపాధి హామీ హక్కును పథకం కిందకు మార్చింది. దీంతో గ్రామీణ పేదలు రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. ఒక పక్కన రాష్ట్రాల హక్కులు కాలరాస్తూ ఉపాధి హామీ పథకంలో నలభై శాతం భారం రాష్ట్ర ప్రభుత్వాలపై పెట్టింది. దీంతో పేరు మార్చి గొప్పగా చెప్పుకున్న ఉపాధి హామీ పథకం ఉనికే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అలాగే మేడే స్ఫూర్తితో సాధిం చుకునే ఎనిమిది గంటల పనివిధానాన్ని పెట్టుబడి దారుల అనుకూల ప్రయోజనాలను నెరవేర్చేందుకు స్వస్తి పలికింది.29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్గా మార్పుచేసింది. నూతన విద్యుత్ చట్టం పేరుతో పార్లమెంటులో కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. స్మార్ట్మీటర్లు పెట్టి ప్రజలకున్న సబ్సిడీ ఎత్తివేసి రైతాంగం మీద భారం పడే విధంగా నిర్ణయాలు చేస్తుంది.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా రసాయనిక ఎరువుల కొరత వచ్చే ఖరీఫ్ సాగుకు ప్రతిబంధకంగా మారే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా టన్ను ధర (ప్రస్తుతం 680 డాలర్లు) ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ ల యుద్ధం మొదలయ్యాక 48 శాతం పెరిగింది. 2026 -27 ఎరువుల సబ్సిడీ రూ.1.7లక్షల కోట్లని కేంద్రం అంచనా. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంచనా ప్రకారం వార్షిక ఎరువుల సబ్సిడీ 25 శాతం పెరిగి రెండు లక్షల కోట్లు దాటుతుందని అంచనా. దీనిమీద కేంద్ర ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళికా లేదు. రైతులకు ఎంతో మేలు చేశామని చెప్పిన మోడీ ప్రభుత్వం నేషనల్ బ్యూరో క్రైమ్ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 2014 నుంచి మోడీ అధికారంలో ఉన్న ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో లక్షా70 వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకు న్నారు. వీటిలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా రైతుల ఆత్మ హత్యలున్నాయి. 2023లో ఎన్సిబి రికార్డులప్రకారం 4690 మంది రైతులు, 696 మంది వ్యవసాయ కూలీలు మొత్తం కలిపి 10786 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా లెక్కల్లోకి రాని సంఖ్య చాలానే ఉంటుంది. ఈ ఒక్క అంశం చాలు కేంద్రప్రభుత్వం విధానాలు రైతాంగానికి ఏ విధంగా మేలు చేస్తున్నాయన్నది చెప్పడానికి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పంటలకు బోనస్ ఇస్తానని చెప్పి కేవలం వరి పంటకు మాత్రమే ఇస్తుంది. ఈ బోనస్ కూడా సన్న రకం వరికి మాత్రమే వర్తింపజేస్తోంది. దొడ్డువరి వేసిన రైతులు బోనస్ లేక నష్టపోతున్నారు. అలాగే వేసంగి పంటకు బోనస్ ఇవ్వటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంటలకు బీమా సౌకర్యం లేదు.’ధరణిలో అనేక లోపాలున్నాయి..అందుకే భూభారతి తీసుకొచ్చాం ఇది భూ సమస్యలన్నింటికీ తారకమంత్రం లాంటిదని’ చెబుతున్నా ఇంతవరకు భూ సమస్యలు పరిష్కారం కాలేదు. రైతులు కాళ్లరిగేలాగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తానన్న హామీ గాలి కొదిలేసింది. అలాగే కౌలురైతులకి ఎటువంటి బీమా సౌకర్యం లేదు. వ్యవసాయ కూలీలకి రూ.12 వేల సాయం ఊసే మరిచింది. పోడు రైతులకు పెండింగ్లో ఉన్న పట్టాల గురించి మాట్లాడటం లేదు. రూ. రెండు లక్షల రుణమాఫీని కూడా సంపూర్ణంగా అమలు చేయడం లేదు. పత్తి కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ను తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం దానిన అమలులోకి తెచ్చింది. దీని వల్ల భూభారతిలో పెండింగ్ ఉన్న భూమికి యూరియా ఎట్లా వస్తది అన్నది ఇంతవరకు చెప్పటం లేదు. స్మార్ట్ఫోన్ లేని రైతాంగానికి ఏ విధంగా యూరియా అందజేస్తారనేది ఇక్కడ ప్రధాన సమస్య. ఇలాంటి అనేక సమస్యలు వివిధ రూపాల్లో రైతులు ఎదుర్కొంటున్నారు. దేశానికి అన్నంపెట్టిన చేతులే నేడు ఆపన్నహస్తం కోసం ఎదురుచూడటం బాధాకరం. పెట్టుబడి రెట్టింపు అయిందని, సాయం చేయండి మహాప్రభో అని వేడుకుంటున్నా పాలకులు కనికరించడం లేదు. అందుకే పోరాటాల ద్వారానే పాలకుల మెడలు వంచాలని రైతులు ‘పొలికేక’తో సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నేడు ప్రారంభమయ్యే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో రైతాంగ సమస్యలు, చర్చలు, తీర్మానాలతో నూతన కార్యచ రణను రూపొందించనున్నారు. మోడీ సర్కార్ తెచ్చిన వ్యవసాయ మూడు నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతాంగాన్ని సమీకరించి, అఖిలభారత్ కిసాన్ సభ ఢిల్లీ కేంద్రంగా పదమూడు నెలల పాటు పోరాడి విజయం సాధించింది. ఆ స్ఫూర్తితోనే ఈ మహాసభల దిశానిర్దేశం భవిష్యత్తు రైతాంగ పోరాటాలకు కీలకంగా మారనుంది.
వై.వంశీకృష్ణ
9908997969



