కొల్కతా : పశ్చిమ బెంగాల్లో ముర్షిదాబాద్ జిల్లాలోని రేజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష లెఫ్ట్ ఫ్రంట్ ప్రతిపాదించిన సిపిఎం అభ్యర్థి, ప్రముఖ న్యాయవాది సయీద్ అసద్ అలీ పోటీ చేయనున్నారు. మంగళవారం నాడు ఆయన తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తూర్పు మిడ్నాపుర్లోని నందిగ్రామ్లోనూ, ముర్షిదాబాద్లోని రేజీనగర్లో వచ్చే అక్టోబర్ 6న పోలింగ్ జరగనుంది. అదే నెల 9న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నందిగ్రామ్లో లెఫ్ట్ఫ్రంట్ నామినేట్ చేసిన సిపిఐ అభ్యర్థి శాంతిగోపాల్ గిరి బరిలో నిలిచారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నేత సువేందు అధికారి నందిగ్రామ్లోనూ, భవానిపుర్ స్థానాల్లో విజయం సాధించడంతో ఆయన భవాని పుర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించడం, అలాగే రేజీ నగర్లోనూ, నవ్దా స్థానాల్లో ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ (ఎజెయుపి) నేత హ్యు మయున్ కబీరు విజయం సాధించగా ఆయన నవ్దా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సివచ్చింది.



