ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్ఎస్ కు చెంపపెట్టు
ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ సిద్ధం
కేసీఆర్ ఫాంహౌజ్ పై ప్రజలకు నిజాలు తెలియాలి
బీజేపీది పార్టీలను చీల్చేతత్వం
మోదీ, అమిత్షా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారు : పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి శ్రీరామరక్ష అని పీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో ఈ ఫిరాయింపుల కల్చర్ ను తెచ్చిన కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలకు ఇది చెంపపెట్టు అని విమర్శించారు. మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న మహేశ్ కుమార్ గౌడ్… శనివారం తెలంగాణ భవన్ లోని శబరీ బ్లాక్ లో మీడియాతో చిట్చాట్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.2014, 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వమే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని గుర్తు చేశారు. టీడీపీలో గెలిచిన తలసాని, కాంగ్రెస్ నుంచి గెలిచిన సబిత, ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు నేరుగా మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ ది అని మండిపడ్డారు. అలాగే కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకుని ప్రతిపక్షానికి శాసనసభలో సరైన హోదా లేకుండా చేశారన్నారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలోనూ అప్పటి ప్రభుత్వం అనుసరించిన విధానాలను రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు.
ప్రభుత్వాన్ని కూల్చుతామన్నారు…
పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే ముందు తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకోవాలని బీఆర్ఎస్ నేతలకు పీసీసీ చీఫ్ హితవు పలికారు. ప్రధానంగా ఆనాటి సీఎం కేసీఆర్ అనేక నిబంధనలు ఉల్లంఘించి, ఫిరాయింపులను ప్రోత్సహించారని మండిపడ్డారు.
బీజేపిది పార్టీలను చీల్చే సంస్కృతి…
దేశవ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులను బీజేపీ కూడా ప్రోత్సహించిందని మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. ఫిరాయింపులతో ఆగకుండా… పార్టీలను చీల్చి లబ్ది పొందే సంస్కృతికి తెరలేపిందని తీవ్రంగా మండిపడ్డారు. టీ-ఎంసీ, శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను చీల్చి పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీశారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన రాజకీయ ప్రమాణాలు ఉండాలని అన్నారు. కాగా… ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలనే నిర్ణయం పూర్తిగా సీఎం రేవంత్రెడ్డిదేనన్నారు. పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో అధిష్టానం, ముఖ్యమంత్రి నిర్ణయాలకు అనుగుణంగానే ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.



