Sunday, June 8, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిదక్షిణాదిన భాషా వివాదం - బీజేపీ పాచిక

దక్షిణాదిన భాషా వివాదం – బీజేపీ పాచిక

- Advertisement -

కమలహాసన్‌ మణిరత్నం కాంబినేషన్లో దశాబ్దాల తర్వాత వచ్చిన సినిమా ‘థగ్‌లైప్‌’ సరిగ్గా ఆడకపోయినా ఆ నేపథ్యంలో అనుకోకుండా వచ్చిన ఒక వివాదాన్ని మాత్రం బీజేపీ బాగా పెద్దది చేస్తున్నది. కర్ణాటక తప్ప మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో తనకంటూ పెద్ద పునాదిలేని బీజేపీ ఆ ఒక్కచోట మళ్లీ పుంజుకోవడానికి ఈ వివాదాన్ని సాధనంగా చూస్తున్నదా అని సందేహం కలుగుతుంది. అదే సమయంలో తమిళ కన్నడ భాషల అనుబంధం గురించి కమలహాసన్‌ చేసిన వ్యాఖ్యల నిజానిజాలు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆ అంశంలో మరింత స్పష్టత కోసం ప్రయత్నించవచ్చు. విమర్శించుకోవచ్చు. అంతేకానీ ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు వివాదాలు పెంచాలని చూడటం మటుకు వాంఛనీయం కాదు. నటుడు ప్రకాష్‌రాజ్‌ లాగే కమలహాసన్‌ కూడా ప్రధానంగా తమిళనాడులో బీజేపీ కూటమికి దాని మత రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడుతున్న వ్యక్తి. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిని బలపరిచి తన ‘మక్కల్‌ నీతిమయం’ పార్టీని పోటీకి దూరంగా ఉంచారు. ప్రస్తుతం ఆయన తమిళనాడు ఇండియా వేదిక రాజ్యసభకు పంపిస్తున్నది. ఆయన మాటలపై మంట పెట్టడంలో బీజేపీకి ఆ కడుపు మంట కూడా ఉంటుందనేది స్పష్టం. ప్రకాష్‌ రాజ్‌ విషయంలోనైతే ఎప్పటికప్పుడు దాడి చూస్తూనే ఉంటాం. ఇంటింటికి సింధూరం తీసుకువెళ్తామని ఈ మధ్య మోడీ చేసిన వ్యాఖ్యపై ఆయన స్పందిస్తూ ‘ఈ వద్ధుడు కుంకుమ తీసుకుపోతే ఎవరు తీసుకుంటారని’ ప్రశ్నించారు. భాషా పరంగా గాని, సంప్రదాయ కోణంలో కానీ ఈ మాటల్లో పెద్ద తప్పేమీ లేదు. అయినా అదేదో భారతీయ మహిళలను కించపరిచినట్టుగా రభస చేయడానికి విఫల యత్నం చేసింది బీజేపీ.
ప్రేమ పూర్వకంగానే…
తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాషో నిర్వహించిన కమలహాసన్‌ వాస్తవానికి బహుభాషా నటుడు. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ ఆయన చిత్రాలు విజయవంతం కావడమే కాదు, 50 ఏండ్ల కిందటే హిందీలోనూ చేవ చూపిన, సత్తా చాటిన ప్రతిభా వంతుడు. ఆ మాటకొస్తే ఆయన సమకాలీకుడైన రజనీకాంత్‌ అసలు కన్నడసీమ నుంచే వచ్చినవారు. కన్నడం తమిళం ఒకటేనంటూ అనుబంధం చాటడానికి చాటిన కమలహాసన్‌ ఉత్సాహంలో తమిళం నుంచి కన్నడం పుట్టిందని భాషావేత్తలు చెప్పారని అన్నారు. ఆయన ఈ మాటలు అన్నప్పుడు పక్కన ప్రఖ్యాత కన్నడ హీరో రాజ్‌కుమార్‌ పుత్రుడైన శివరాజ్‌ కుమార్‌ కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలి.. కావేరి జలాలతో సహా రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్న మాట నిజమైనా అనుబంధం కూడా చాలా ఎక్కువ. తాను ఆ స్నేహభావాన్ని చాటడానికే మాట్లాడానని కమల్‌ పదేపదే వివరించారు. అయినా ఆయన కన్నడాన్ని అవమానిం చారని, క్షమాపణలు చెప్తే తప్ప సినిమా విడుదల కానీయబోమని ఈ వర్గాలు రభస సృష్టించాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ ఈ వైఖరి తీసుకున్నప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా కొంతవరకూ అదే తరహాలో మాట్లాడారు. వీటన్నిటి తర్వాత కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ కమలహాసన్‌ ఆ మాటలు వెనక్కు తీసుకుంటేనే ఆయన సినిమా కన్నడ వెర్షన్‌ విడుదలకు ఒప్పుకుంటామని షరతు పెట్టింది. తాను ప్రేమతో ఆ మాట అన్నాను తప్ప మరో విధంగా కాదని, ప్రేమ క్షమాపణలు చెప్పదని కమల్‌ స్పష్టికరించారు. ఆశ్చర్యం ఏమంటే కర్ణాటక హైకోర్టు కూడా దీనిపై అవసరాన్ని మించి స్పందించడమే కాక క్షమాపణలు చెప్పి తీరాలని సూచించింది. మీరు ఏమైనా చరిత్రకారులా భాషాన్నిపుణులా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్కతి మతం పేరుతో కీలక పదవుల్లో ఉన్న నాయకులు రకరకాలుగా మాట్లాడినప్పుడు మిన్న కుండిపోయిన ఉన్నత న్యాయస్థానాలు సమస్య లేని చోట వివాదం పెంచే వ్యాఖ్యలు చేయడం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఆయన తన చిత్రాన్ని కన్నడలో విడుదల చేయరాదని క్షమాపణల ప్రసక్తి లేదని ప్రకటించారు. అదే సమయంలో తన స్నేహపూర్వక వ్యాఖ్యలను వివరిస్తూ ఛాంబర్‌కు లేఖ కూడా రాశారు. ఈ లోగా ఇతర రాష్ట్రాలలో ఆ చిత్రం విడుదల విఫలం కూడా సంభవించాయి.
చరిత్ర వాస్తవాలేమిటి?
ఇంతకూ మనం ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి? దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, తుళు, తొద ఒకే కుదురు నుంచి వచ్చాయని భాషావేత్తలు మొదటి నుంచీ భావిస్తున్నారు అదే ఆది ద్రావిడ భాష. ఈ క్రమంలో ముందు తమిళ భాష విడిపోయిందని ఒక బలమైన అభిప్రాయం ఉంది. తమిళ భాషా సాహిత్య ఆధారాలు మిగిలిన వాటికంటే ప్రాచీన కాలం నుంచి లభ్యం కావడం ఇందుకు ప్రధాన కారణం.. క్రీస్తుపూర్వం సంగం సాహిత్యం అనేది తమిళంలో తొలి వారసత్వంగా పరిగణిస్తారు. ఇందులో బౌద్ధ జైన కథలు కూడా అనేకం ఉంటాయి. కన్నడంలో 8వ శతాబ్ది నుంచి సాహిత్యం లభిస్తున్నది. తెలుగుకు వస్తే 11వ శతాబ్ది నాటి నన్నయ్య భారతాన్ని అధికవ్యమంటూ ఇటీవల వరకు గొప్పగా చెప్పేవారు వేయ్యేండ్ల తెలుగు సాహిత్యం అన్న మాట అలా పుట్టిందే.ఈ మూడు భాషలు ఒకదాని నుంచి ఒకటి వచ్చాయని చెప్పడానికి ఆధారాలు లేకపోయినా అన్ని ఒకే కుదురు అన్నది మాత్రం దాదాపు ఖచ్చితంగా ఒప్పుకున్నదే. భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన భాషావేత్త డాక్టర్‌ భద్రిరాజు కష్ణమూర్తి దగ్గర నుంచి పాశ్చాత్య పరిశోధకుల వరకు ఈ అంశాన్ని ధ్రువీకరించారు. బహుశా కమల్‌ ఉద్దేశం కూడా ఇదే అయి ఉండవచ్చు. అపార్థం ఉంటే సవరించుకోవచ్చు కానీ క్షమాపణలు, భాష యుద్ధాలు అవసరమేముంది? తమిళనాడు సీపీఐ(ఎం) కార్యదర్శి షణ్ముగం ఒక సభలో మాట్లాడుతూ ఇదే చెప్పారు. తమిళనాడులో కాలూనితే చాలని, కర్ణాటకలో ఎలాగో మళ్లీ అధికారంలోకి రావాలని తంటాలు పడుతున్న బీజేపీి దీన్ని కావాలనే పెద్దది చేస్తున్నది. వారికి తమిళనాడులో అవకాశం తక్కువ. పైగా అక్కడ కమల్‌ ప్రత్యర్థి శిబిరంలో వున్నారు. మొన్న లోక్‌సభ ఎన్నికల్లో 100 శాతం ఇండియా స్ట్రయిక్‌రేట్‌కు కలసి వచ్చారు కూడా. ముందే చెప్పినట్టు లౌకికవాదంతో నిలబడుతున్న ఈ ప్రముఖ నటుల పట్ల ద్వేషం కూడా ఇందుకు కారణమని చెప్పాలి. ఈ వివాదంలో కమల్‌ యదాలపంగా స్నేహపూర్వకంగా మాట్లాడిన దానికి బీజేపీ వర్గాలు రాజకీయ వ్యూహాలతో చేస్తున్న దానికి మధ్య తేడా కాదనలేనిది. ముందు వెనకలు అలా ఉంచితే దక్షిణాది భాషల మధ్య అనుబంధం చెరిపి వేయలేనిది. దేశం మొత్తం మీద హిందీ భాషను బలవంతంగా రుద్దాలని, అసలు భాషా ప్రయత్నం రాష్ట్రాల హక్కులను హిందీ హిందూత్వతో అణగదొక్కాలని చూస్తున్న చూసే సంఘపరివార్‌ ఇలాంటి హడావుడి చేయటం మరింత హాస్యాస్పదం.
సనాతనంతో వెనక్కు…
సనాతనవాదం ముదిరిపోయిన వారు ఏదైనా మాట్లాడవచ్చు కానీ సామాజిక రాజకీయ విషయాల్లో లాగే భాషాపరమైన అంశాల్లో కూడా దాని ప్రభావం కాదనలేనిది. 20 ఏండ్ల కిందట అప్పటి యూపీఏ ప్రభుత్వం తమిళానికి ప్రాచీన హౌదా ఇవ్వడం చర్చకు దారి తీసింది. తెలుగు కూడా హౌదా ఇవ్వాలని పెద్ద ఉద్యమమే నడిచింది. ఆ క్రమంలో కాస్త ముందు వెనకగా దాంతోపాటు సంస్కత, కన్నడ, మలయాళ భాషలకు కూడా ప్రాచీన హౌదా వచ్చింది. పాలి, ప్రాకత, అస్సామీ, బెంగాలీ, మరాఠి, ఒడియ భాషలూ ప్రాచీన జాబితాలో స్థానం పొందాయి. ఇందులో చెమ్మిలన్‌ అనే ప్రాచీన నామంతో తమిళం క్రీస్తుపూర్వం 300లకు ముందు నాటిదని చెబుతారు. ప్రాచీన భాష దైవభాష అనే సంసృతంలో సాహిత్యం దాని తర్వాత వందేళ్లకు కాని లభించలేదు. కన్నడంలో క్రీశ 8వ శతాబ్దిలో సాహిత్యం లభిస్తున్నది. ఇక తెలుగు భాషకు క్రీశ ఆరో శతాబ్ది నుంచి శాసనాలు దొరికాయి. తెలుగు భాషాభిమానులు, పరిశోధకులు చూపించే ఆధారాలు అంతకన్నా వందల ఏండ్లు వెనక్కు వుంటాయి. అంచనాల్లో ఈ హెచ్చుతగ్గులకు చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. తెలుగు తీసుకుంటే 11వ శతాబ్ది నాటి భారతాన్ని కవి నన్నయను ఆది కవిగా చెప్పడం సంప్రదాయకారులు చేసిన పని. ఏ భాషలోనైనా మహాకావ్యం హఠాత్తుగా ఉద్భవించదు. దానికన్నా చాలాకాలం ముందు నుంచి శాసనాల్లో, జానపదాల్లో, ప్రజల నుడిలో తెలుగు సజీవంగా ఉంది. కానీ పండిత్మన్యులలో గుర్తించకపోగా గ్రామ్య భాషగా ఈసడించారు. అసలు బౌద్ధ జైనాలతో సహా వైదికేతర సాహిత్య సంపదను కావాలనే నిర్లక్ష్యం చేశారు. అన్నమయ్య సినిమాలో చూపించినట్టుగా వాటిని నాశనం చేయడానికి కూడా ప్రయత్నించారు. ఆయనకు అంతటి ప్రాచుర్యం రావడానికి చాలా సమయం పట్టింది. మనకు తెలిసి వేమన పద్యాలనే తొక్కిపడితే బ్రౌన్‌ వెలికి తీయాల్సి వచ్చింది. ఒక ముక్కలో చెప్పాలంటే ఆదికవులను కీర్తిస్తూ సోది కవులను విస్మరించడం వల్లనే తెలుగు భాషా చరిత్రకు కూడా హాని కలిగింది. అదే తమిళులు సంగం సాహిత్యాన్ని సగర్వంగా నిలబెట్టుకున్నారు. కనుక వారికి చరిత్ర ఎక్కువగా దొరుకుతున్నది. నన్నయ భారతరచనకు కన్నడ నారాయణభట్టు సహకరించారు. నారాయణభట్టు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారంటారు. తెలుగులో కన్నడ తమిళ పదాలు కూడా వందల సంఖ్యలో వున్నాయి. కన్నడ నారాయణ భట్టు తెలుగు భారతానికి సహకరించడంలో పాఠాలు మరవరానివే. తెలుగు, తెలంగాణ భాష వేరన్నట్టు కొంతమంది వాదించినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రపంచ తెలుగు మహాసభలే నిర్వహించారు. ఇటీవల రేవంత్‌ ప్రభుత్వం తెలుగు చిత్రాలన్నింటికీ కలిపి అవార్డులు ప్రకటించటం కూడా చూశాం. కన్నడ తమిళ వివాదమే వద్దంటుంటే తెలుగు భాషా ప్రయోగాల్లో ఎన్ని తేడాలున్నా వేరువేరుగా చూడటం సాధ్యమయ్యేది కాదు.. ఏమైనా ఈ పూర్వ రంగంలో చూస్తే దక్షిణాన భారత భాషల మధ్య అనుబంధం మౌలికమైనదని ప్రాచీనమైందని స్పష్టంగా తెలుస్తుంది.
వీరమల్లు కూడా వెనక్కు!
ఈ సమయంలోనే సనాతనం తాలూకూ మరో పార్శ్యం కూడా సినీ నటుల నుంచే చూడటం ఆసక్తికరం. ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు కూడా థగ్‌లైప్‌ కన్నా ముందునుంచే విడుదల ప్రచారం చేసుకుంది. దాని విడుదల అడ్డుకోవడానికి సింగిల్‌ థియేటర్ల పేరిట కుట్ర జరిగిందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష మాత్రమే గాక స్వయంగా ఆయన కార్యాలయం కూడా హడావుడి చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో అది పెద్ద వివాదంగా మారింది. వీరమల్లు కూడా జౌరంగజేబ్‌ కాలంనాటితో ముడిపెట్టిన
సనాతన ప్యాన్‌ ఇండియా సీరిస్‌లో భాగమే! వింత వివాదం నడిపి దీన్ని విడుదల చేసింది కూడా లేదు. రాజకీయ సినీ సాంసృతిక మత విషయాలను కలగాపులగం చేసి ప్రజల దృష్టిని ఎలా దారిమళ్లిస్తున్నారో దీన్ని బట్టే తెలుస్తుంది. తాజాగా డిప్యూటీ సీఎం కార్యాలయం గోసంరక్షణపై చేసిన ట్వీట్‌ కూడా ఈ కోవలోదే. గోవులను గౌరవించడం పూజించడం వారి వారి ఇష్టం. అయితే బక్రీద్‌ సందర్భంగా దొంగతనంగా గోవులను తరలించుకుపోయే ప్రమాదం వుందని ఉపముఖ్యమంత్రి కార్యాయం మరో మతం పండుగతో ముడిపెట్టి హెచ్చరించడమేమిటి? అది వారిపై సందేహం వెలిబుచ్చడమే కదా? ఈ సమయంలోనే సుప్రీం కోర్టు ముందుకు ఇలాంటి ఆరోపణ ఒకటి పిల్‌ రూపంలో వస్తే విచారించేందుకు నిరాకరించింది.
ఢిల్లీలో బీజేపీి ప్రభుత్వం కూడా ఇలాంటి సర్య్యులర్‌ ఇచ్చింది గానీ మరీ ఇంత సూటిగా కాదు. ఇప్పటి వరకూ చెప్పుకున్న కర్ణాటకలో భజరంగదళ్‌ మాత్రమే ఇలాంటి ప్రచారం ఎత్తుకుంది. ఏపీ ప్రభుత్వంలో రెండవ స్థానంలో వున్న పవన్‌ అధికారికంగా అదే వాదన చేయడం చంద్రబాబు ప్రభుత్వ అధికారిక ఆలోచనగా వుంటుందా? భాష, మతం, ఆచారం ఏ విషయంలోనైనా సరే ప్రజల మధ్య విభజన పెంచే చర్యలు మాత్రం అనుమతించరానివి.
తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -