జ్యుడీషియల్ దర్యాప్తునకు ఆదేశించాలి : ప్రధాని మోడీకి
ఐదు కమ్యూనిస్టు పార్టీల నేతల లేఖ
న్యూఢిల్లీ : ఆపరేషన్ కగర్ పేరుతో ఛత్తీస్గఢ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో చట్టవిరుద్ధమైన రీతిలో చోటు చేసుకుంటున్న హత్యల (ఎక్స్ట్రా జ్యుడీషియల్ కిల్లింగ్స్)ను తక్షణమే ఆపుచేయాలని ఐదు కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఐదు పార్టీలు సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(మార్క్సిస్ట్ లెనినిస్ట్) లిబరేషన్, ఆర్ఎస్పీ, ఏఐఎఫ్బీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. భద్రతా బలగాల కస్టడీలో ప్రస్తుతం అనేకమంది సీనియర్ మావోయిస్టు నేతలు వున్నట్టు వార్తలు వస్తున్నాయి. వారందరినీ తక్షణమే కోర్టులో ప్రవేశపరచాలని, చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ ప్రాంతమంతా సైనిక చర్యలు ఎక్కువై పోయాయని, దీనివల్ల సాధారణ జన జీవనానికి పూర్తిగా అంతరాయం కలుగుతోందని ఈ ప్రాంతంలోని ఆదివాసీలు దీర్ఘకాలంగా ఆందోళన చేస్తూనే వున్నారు. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో పేర్కొన్న ఆదివాసీ హక్కులు ఒక పద్ధతి ప్రకారం ఉల్లంఘించబడతున్నాయని, ఛత్తీస్గఢ్ అడవులు, ఖనిజాలు వివక్షతాపూరితమైన కార్పొరేట్ దోపిడీకి గురవుతున్నాయని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల పర్యావరణ సుస్థిరతకు తీవ్ర పర్యవసానాలు ఎదురవుతాయని, స్థానికుల జీవనోపాధి దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఆదివాసీలను అపరిమితమైన శతృత్వంతో చూసే ఈ సైనికీకరణ వైఖరిని తక్షణమే విరమించాలని కమ్యూనిస్టు పార్టీల నేతలు ప్రధానిని కోరారు.
మరణించిన తర్వాత కూడా ఈ శతృత్వపు వైఖరి కనిపిస్తోందని, వారి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోందని పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు సముచితమైన రీతిలో తుది వీడ్కోలు పలికే హక్కును ఆ కుటుంబాలకు దూరం చేస్తున్నారన్నారు.
చర్చలు జరపాల్సిందిగా మావోయిస్టులు పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్లోని బీజేపీ ప్రభుత్వం చర్చలు ద్వారా పరిష్కారాన్ని కనుగొనాలని కోరుకోవడం లేదు. దానికి బదులుగా, వారు అత్యంత అమానుషమైన హత్యలు, వినాశనం విధానాన్ని అనుసరిస్తున్నారు.
డెడ్లైన్ను పునరుద్ఘాటిస్తూ కేంద్ర హోం మంత్రి, చర్చలు జరిపే అవసరం లేదంటూ చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు విముఖంగా వున్న వారి మనస్తత్వం ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వం మొండిగా వ్యవహరించరాదు. ఈ దేశ చట్టాలు, ప్రజాస్వామ్య పాలనా సూత్రాల స్ఫూర్తికి వ్యతిరేకంగా మానవ ప్రాణాలను హరించడాన్ని వేడుకగా చూడరాదు.
భిన్నాభిప్రాయాలు వున్నప్పటికీ, మావోయిస్టులు ప్రకటించిన ఏకపక్ష కాల్పుల విరమణకు స్పందించి, అన్ని సమస్యల పరిష్కారానికి గానూ చర్చలు చేపట్టాలని ఇప్పటికే అనేకమంది పౌరులు, రాజకీయ పార్టీలు, నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఈ ఎక్స్ట్రా జ్యుడీషియల్ కిల్లింగ్స్ను, హింసను ఆపాలని నిష్పక్షపాతంగా జ్యుడీషియల్ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతున్నామని కమ్యూనిస్టు నేతలు ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆ లేఖపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆర్ఎస్పీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, ఏఐఎఫ్బీ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్లు సంతకాలు చేశారు.
ఛత్తీస్గఢ్లో చట్టవిరుద్ధ హత్యలను ఆపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES