Sunday, June 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమూడోసారీ పాత పాటే

మూడోసారీ పాత పాటే

- Advertisement -

– కొన్ని ప్రశ్నలకు మినహా నోరు మెదపని మాజీ ఐజీ ప్రభాకర్‌రావు
– 17న తిరిగి విచారణకు రమ్మని సిట్‌ హుకుం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో మూడోసారి సిట్‌ విచారణలో సైతం ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు పాత పాటే పాడినట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం 11.15 గంటల నుంచి రాత్రి 8.30 వరకు ఒక గంట భోజన విరామం మినహా సుదీర్ఘంగా స్పెషల్‌టీం అధికారులు ప్రభాకర్‌రావును విచారించారు. మొదటి, రెండోసారి విచారణలో ఏ విధమైన సమాధానాల వ్యవహారం నడిచిందో.. మూడోసారి కూడా ప్రభాకర్‌రావు అదే విధానాన్ని అనుసరించినట్టు సమాచారం. ముఖ్యంగా, తాను ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో తన కింద పని చేసిన డీఎస్పీ ప్రణీత్‌రావుకు ఫోన్‌ట్యాపింగ్‌లను జరపాలంటూ తాను ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని మరోసారి ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే, మీరు ఆదేశిస్తేనే ఎస్‌ఐబీ కార్యాలయంలో ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను ఏర్పాటు చేసుకున్నట్టు ప్రణీత్‌రావు శుక్రవారం తనను విచారించిన సమయంలో వెల్లడించడాన్ని సిట్‌ అధికారులు మాజీ ఐజీ దృష్టికి తీసుకురాగా.. అందుకు ఆయన మౌనం వహించినట్టు సమాచారం. పలు సందర్భాల్లో కొన్ని ఫోన్‌ నెంబర్లను పంపించి, వాటిని ట్యాప్‌ చేయాలని ప్రణీత్‌రావును మీరు ఆదేశించారు కదా అని దృష్టికి తీసుకురాగా.. ప్రభాకర్‌రావు నుంచి పొంతనలేని సమాధానాలు వచ్చినట్టు తెలిసింది. చివరికి అదనపు ఎస్పీలు తిరుపతన్న, బుజంగరావు, నగర టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీజీపీ రాధాకిషన్‌రావులు ప్రభాకర్‌రావు ఆదేశంతోనే తాము ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడినట్టు ఇచ్చిన వాంగ్మూలాన్ని సిట్‌ అధికా రులు ఆయనకు చూపించగా.. దాని పైన ఆయన నేరుగా సమాధానమి వ్వలేదని సమాచారం. మొత్తమ్మీద, దాదాపు తొమ్మిది గంటలపాటు సాగిన విచారణలో సిట్‌ అధికారుల ఓపికను ప్రభాకర్‌రావు పరీక్షించినట్టు తెలిసింది. దీంతో సిట్‌ అధికారులు విచారణను ముగించి తిరిగి ఈనెల 17న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ లోపల ఇదివరకు తాము ప్రశ్నించిన అధికారులు తిరుపతన్న, బుజంగరావు, రాధాకిషన్‌రావులను సిట్‌ అధికారులు మరోసారి విచారించే అధికారమున్నదని తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -