మరో ‘నంది’లా గద్దర్ అవార్డు : ప్రొఫెసర్ కంచ ఐలయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సంస్కృతి భూస్వామ్య స్థితి నుంచి ప్రజాస్వామ్య రూపంలోకి మారడంలో గణనీయ పాత్ర పోషించి, ఆడిపాడిన వందలాది మంది కళాకారులను, ప్రజా గాయకులను, రచయితలను రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోవడం బాధాకరమని ప్రొఫెసర్ కంచ ఐలయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం జరిగిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం సినీ నటులు, రాజకీయ నాయకుల వేడుకలా కనిపించిందని విమర్శించారు. ప్రజాకవులను విస్మరించడాన్ని తప్పుబట్టారు. ‘నేను గద్దర్కు దగ్గరి మిత్రుడిని. కాంగ్రెస్కు మద్దతివ్వాలని ఒప్పించా. నేను రాహుల్ గాంధీకి, తెలంగాణ ప్రభుత్వానికి మద్దతిస్తున్నాను. అందుకు ప్రతిగా దూషణలు, బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. గద్దర్ పేరిట అవార్డు ప్రకటించడం ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతిలో కొత్త విప్లవం మొదలవుతుందని భావించాను. కానీ ఇప్పుడు సినిమా రంగాన్ని ఏయే కులాలు ఆధిపత్యం చేస్తున్నాయో, ఎవరు పెత్తనం చేస్తున్నారో మనకందరికీ తెలుసు. వారు తెలంగాణ ప్రజల సంస్కృతి పట్ల ఎలాంటి వైఖరితో ఉంటారో కూడా మనకు తెలుసు. డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్న సినిమా సంస్కృతిని మార్చి, ఫూలే తరహా కొత్త తెలుగు సినిమా నిర్మాణ సంస్కృతిని తీసుకురావాలని గద్దర్ అవార్డు ద్వారా ఆశించాం. కానీ, అటువంటి కొత్త ప్రారంభం ఎక్కడా కనిపించలేదు. అవార్డు జ్యూరీలో ఒక్క జానపద కళాకారుడు కూడా లేడు. అందరూ డబ్బు కోసం పనిచేసే సినిమా కళాకారులే. ప్రజల కళలకు ప్రాతినిధ్యం ఎక్కడీ జ్యూరీలో గద్దర్ సాంస్కృతిక ప్రతినిధి ఎక్కడా? గద్దర్ పాపులర్ పాట అయినా ”పొడుస్తున్న పొద్దుమీద” అనే పాటకు ప్రాతినిధ్యం వహించే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కళాకారులెక్కడీ గద్దర్ అంటేనే ప్రజా పాట. అవార్డు ప్రదాన సమయంలో అటువంటి ప్రజా పాటల, ప్రజా కళాకారులకు సంబంధించిన ప్రజా కళల ప్రతినిధులెక్కడీ వారికి ఆహ్వానం ఎందుకు పంపలేదు? ప్రజా కవులను విస్మరించడం ఎంతవరకు సబబు?గద్దర్ అవార్డును మరో నందీ అవార్డుగా మార్చేశారా?’ అని విమర్శలు ఎక్కుపెట్టారు.
ప్రజాకవులను మరిచిపోవడం విచారకరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES