– పోలీస్ కమిషనర్
నవతెలంగాణ ఖమ్మం
స్వేచ్ఛాయుత వాతావరణంతో కూడిన నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా ఖమ్మం కమిషనరేట్ పరిధిలో విస్తత తనిఖీలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి అన్ని మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. సరిహద్దుతో పాటు నగరంలో రాకపోకలు సాగించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సరైన ఆధారాలు చూపించకుండా తరలించే నగదు, నగలు, ఇతరత్రా సొత్తును సీజ్ చేసి, సంబంధిత అధికారులకు అప్పగిస్తారని తెలిపారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ. 50 వేలకు మించి నగదు తీసుకువెళ్లరాదని, పెద్ద మొత్తంలో నగదు, ఆభరణాలు ఉంటే తప్పనిసరిగా వెంట సంబంధిత పత్రాలు ఉండాలని సూచించారు. ఎన్నికల్లో డబ్బు, మాధకద్రవ్యాలు, మద్యం ప్రభావాన్ని నిలువరించేందుకు 21 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 22 ఫ్లైయింగ్ స్క్వార్జ్ టీమ్స్, సరిహద్దు చెక్ పోస్టులు, 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టులు, 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 24 /7 గట్టి నిఘా ఉంచామని తెలిపారు. ఎస్ఎస్టీ మరియు పోలీస్ తనిఖీలలో మొత్తం రూ.1,00,59,130 సీజ్ చేశామని, ఎస్ఎస్టీ, పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా 46,36, 883 రూపాయల మద్యం బాటిల్స్, అదేవిధంగా 11,47,000 లక్షల విలువ చేసే 44 కేజీల గంజాయి పోలీస్, ఎక్సైజ్ తనిఖీలలో సీజ్ చేసినట్లు తెలిపారు. తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచించారు.