నవతెలంగాణ న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో ఆరో దశలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరగబోతుంది. బీహార్ లో 8, హర్యానాలో 10, జార్ఖండ్లో4, ఒరిస్సాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక, ఏడో దశ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఏడో దశలోనూ దేశంలోని 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న ఈ చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే దేశంలో తొలి రెండు దశల్లో ఎన్నికలు ముగిశాయి. తొలి దశలో 102, రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్ ముగిసింది.