– మేలో 2.17 శాతం పతనం
– 21.88 బిలియన్ డాలర్లకు వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లో భారత ఎగుమతులు డీలా పడ్డాయి. ఈ ఏడాది మేలో సరుకుల ఎగుమతులు 2.17 శాతం పతనమై 38.73 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే నెలలో 39.59 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. గడిచిన మేలో దేశ దిగుమతులు 1.7 శాతం తగ్గి 60.61 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు తక్కువగా ఉండి.. దిగుమతులు ఎక్కువగా ఉండటంతో వాణిజ్యలోటు 21.88 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ – మే కాలంలో ఎగుమతులు 3.11 శాతం పెరిగి 77.19 బిలియన్లుగా, దిగుమతులు 8 శాతం ఎగిసి 125.52 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఓ రిపోర్ట్ లో వెల్లడించింది. దీంతో రెండు నెలల్లో 48.33 బిలియన్ల వాణిజ్య లోటు నమోదయ్యింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక అనిశ్చితి ఎగుమతు లపై ప్రభావం చూపిందని వాణిజ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత ఇరాన్- ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు భారత ఎగుమతులపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గడిచిన మే నెలలో బియ్యం, ముడి ఇనుప ఖనిజం, రత్నాలు, అభరణాలు, ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రతికూల వృద్ధి చోటు చేసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు ఏకంగా 30.32 శాతం క్షీణించి 5.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మరోవైపు ముడి చమురు, పసిడి దిగుమతులు వరుసగా 26.14 శాతం, 12.6 శాతం పతనమై 14.75 బిలియన్లు, 2.5 బిలియన్లుగా ఉన్నాయి. భౌగోళిక అనిశ్చితులు ఉన్నప్పటికీ ఎగుమతుల్లో భారత్ రాణించిందని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ పేర్కొన్నారు. గడిచిన రెండు నెలల్లో ముడి చమురు ధరల్లో తగ్గుదల ఈ రంగంలోని భారత ఎగుమతులను ప్రభావిం చేసిందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో స్థూల భారత ఎగుమతులు స్వల్పంగా 0.08 శాతం పెరిగి 437.42 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మరోవైపు దిగుమతులు 6.62 శాతం పెరిగి రూ.720.24 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.
ఎగుమతుల్లో డీలా
- Advertisement -
- Advertisement -