ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసఫ్
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ఎంపీహెచ్డబ్ల్యు (ఎఫ్) పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసఫ్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండో ఏఎన్ఎంలు సోమవారం హైదరాబాద్లోని కోఠి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షలు రాసిన తరువాత సంవత్సరాల తరబడి ఫలితాలు వెల్లడించడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు. కంప్యూటర్ టెక్నాలజీ పెరిగిన ప్రస్తుత రోజుల్లో ఫలితాలు వెల్లడించడంలో జాప్యం జరుగుతుందంటే లోపం ఎవరి వద్దనుందో గ్రహించాలన్నారు. ఒకవైపు సీఎం రేవంత్రెడ్డి 65 వేల ఉద్యోగాలు నింపామని, మరో 35 వేలు నింపుతామని ప్రతి సమావేశంలోనూ చెబుతున్నారని, కానీ అత్యంత కీలకమైన వైద్య రంగానికి సంబంధించిన ఉద్యోగాలు నింపే ప్రక్రియ మాత్రం ముందుకు సాగటం లేదని అన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు టీపీఎస్సీ 2018లో ఏఎన్ఎంలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఆ ఏడాదే పరీక్షలు నిర్వహించి ఫలితాలు మాత్రం 2022 చివరి నెలలో విడుదల చేశారన్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఉందని ఉద్యోగార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే ఎంపీహెచ్డబ్ల్యూ(ఎఫ్) పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ మాట్లాడుతూ.. పరీక్షా ఫలితాలను వెల్లడించడంలో ఆలస్యం జరిగితే 50 సంవత్సరాలు పైబడిన కాంట్రాక్టు ఏఎన్ఎంలు తమ అమూల్యమైన సర్వీసును కోల్పోయే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫలితాలను విడుదల చేయాలన్నారు. అలాగే గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం.. ఉద్యోగానికి ఎంపిక కాని రెండో ఏఎన్ఎంలకు 100 శాతం గ్రాస్ శాలరీతోపాటు రూ.10 లక్షల హెల్త్, రూ.10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేయించి ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీ మెన్ కమిటీ రిపోర్ట్ను వెల్లడించాలన్నారు. లేని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, ఎంహెచ్ఎస్ఆర్బీ మెంబర్ సెక్రటరీ ఎస్ గోపికాంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, రెండో ఏఎన్ఎంల సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు బోయిని శ్యామల, రాష్ట్ర కార్యదర్శులు పి.జయమ్మ, తన్వీర్ సుల్తానా, సంధ్యారాణి గీత, రాష్ట్ర ఉపాధ్యక్షులు లత, గోపమ్మ, కృష్ణవేణి, అలేఖ్య, రాజేశ్వరిరెడ్డి, తంబారపు జయమ్మ, నాగ శేషమ్మ పాల్గొన్నారు.
ఎంపీహెచ్డబ్ల్యూ(ఎఫ్) పరీక్షా ఫలితాలు విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES