నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి, పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ) వీసీ జిఎన్ శ్రీనివాస్ మంగళవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ పీఈసెట్కు 2,557 మంది దరఖాస్తు చేయగా, 1,767 మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. వారిలో 1,678 (94.96 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. ఇందులో బీపీఈడీకి 1,833 మంది దరఖాస్తు చేస్తే, 1,307 మంది పరీక్షలు రాశారని అన్నారు. వారిలో 1,252 (95.79 శాతం) మంది అర్హత పొందారని చెప్పారు.
డీపీఈడీకి 724 మంది దరఖాస్తు చేయగా, 460 మంది హాజరయ్యారనీ, వారిలో 426 (92.61 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. గత విద్యాసంవత్సరంలో 16 బీపీఈడీ కాలేజీల్లో 1,660 సీట్లు, మూడు డీపీఈడీ కాలేజీల్లో 300 సీట్ల చొప్పున మొత్తం 1,960 సీట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, పీయూ మాజీ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్, ఓయూ ప్రవేశాల డైరెక్టర్ రమేష్బాబు, పీఈసెట్ కన్వీనర్ ఎన్ఎస్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
పీఈసెట్ ఫలితాలు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES