Thursday, June 19, 2025
E-PAPER
HomeNewsడబుల్‌ ధమాకా..!

డబుల్‌ ధమాకా..!

- Advertisement -

– సొంత జాగా లేనివారికి డబుల్‌ బెడ్‌రూమ్‌లు
– ఎల్‌2 దరఖాస్తుదారులకు ఇవ్వాలని నిర్ణయం
– కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే లబ్దిదారులే నిర్మించుకోవచ్చు..!
– రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా 69వేల ఇండ్లు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను సొంత స్థలాలు లేని ఇందిరమ్మ దరఖాస్తుదారుల (లిస్ట్‌ 2)కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఇండ్లను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముం దుకొస్తే వారికి నిధులు కేటాయించనుంది. లేనిపక్షంలో లబ్దిదారులే వాటిని పూర్తి చేసుకునేందుకు ఆర్థిక సహాయం గరిష్టంగా రూ.5 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సొంత జాగాలేని ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులు 15 లక్షల మంది ఉండగా కేవలం 69వేల డబుల్‌ బెడ్‌రూ మ్‌ ఇండ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

అసంపూర్తి ఇండ్లకు రూ.2వేల కోట్లు కావాలి
రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను పూర్తి చేసేందుకు రూ.2వేల కోట్ల వరకు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇండ్లు పూర్తి చేయటంతో పాటు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల వద్ద మౌలిక వసతులు కూడా కల్పించాల్సి ఉంది. రూ.లక్షతో పూర్తయ్యే ఇండ్లు కొన్ని ఉండగా రూ.4 లక్షలకు పైగా వెచ్చించాల్సిన ఇండ్లు అనేక చోట్ల ఉన్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.640 కోట్లు వెచ్చించి 1.61 లక్షల డబుల్‌ ఇండ్లను పూర్తి చేశామని గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. వీటిలో 98వేల ఇండ్లను లబ్దిదారులకు కేటాయించామనీ, ఇంకా 69వేల ఇండ్లు పూర్తి చేయాల్సి ఉందని ఆయన అన్నారు.

రాయితీ కల్పించి నిర్మాణాలు..
గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని డబుల్‌ ఇండ్లను ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లిస్ట్‌-2 జాబితాలో చేర్చారు. రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ ద్వారా సర్వే చేశారు. నాలుగునెలల క్రితం నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఇందిరమ్మ యాప్‌తో చేసిన సర్వేను సరిపోల్చారు. వీటి ఆధారంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3గా విభజించింది. ఎల్‌-1లో సొంత స్థలం ఉన్న 21.93 లక్షల మందిని చేర్చారు. వీరందరూ ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తోంది.
ఎల్‌-2లో సొంత స్థలాలు లేని సుమారు 15లక్షలకు పైగా మందిని గుర్తించారు. వీరికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను కేటాయించాలని నిర్ణయించారు. ఎల్‌-3లో ఇండ్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారున్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్‌బెడ్‌రూ మ్‌ ఇండ్లను పూర్తి చేసి ఇవ్వాలని కాంట్రాక్టర్లను ప్రభుత్వం సంప్రదిస్తోంది. గతంలో చేసిన పనులవే బిల్లులు రాలేదు కాబట్టి ఎక్కువ మంది కాంట్రాక్టర్లు నిర్మాణాలను మధ్యలోనే వదిలేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించే అవకాశం లేని దృష్ట్యా రాయితీలు కల్పించాలనే యోచనలో సర్కారు ఉంది. ఇసుకతో పాటు ఇతర రాయితీలు ఇవ్వాలని భావిస్తోంది. అయినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాని చోట లబ్దిదారులే నిర్మించుకునేందుకు వీలు కల్పించనుంది.

ఖమ్మం జిల్లాలో ఎల్‌ 2 దరఖాస్తులు 56వేలు..1,181 డబుల్‌ ఇండ్లు
ఖమ్మం జిల్లాలో 3,48,639 ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎల్‌-1 కింద 73,388, ఎల్‌-2 జాగాలేని దరఖాస్తులు 56,576, ఎల్‌-3 కింద 2,18,675 దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌-2 కింద అత్యధికంగా 31,498 దరఖాస్తులు ఖమ్మం కార్పొరేషన్‌లోనే వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో 8,956 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లలో 6,107 నిర్మాణాలు పూర్తి చేసి 5,581 ఇండ్లను లబ్దిదారులకు కేటాయించారు. ఇంకా 526 ఇండ్లు మిగిలిపోయాయి. 655 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మిగతా వాటి నిర్మాణం చేపట్టలేదు. ఖమ్మంలో 224, పాలేరులో 177, వైరాలో 188, మధిరలో 65, సత్తుపల్లిలో ఒకటి వివిధ దశల్లో నిలిచిపోయాయి. నిర్మాణం పూర్తై పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్‌ ఇండ్లు ఖమ్మంలో 301, సత్తుపల్లిలో 108, పాలేరులో 47, కామేపల్లిలో 40, మధిరలో 30 అందుబాటులో ఉన్నాయి. సిద్ధంగా ఉన్న 526, వివిధ దశల్లో ఉన్న 655 ఇండ్లు మొత్తం జిల్లావ్యాప్తంగా 1,181 డబుల్‌ ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేస్తామని గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి. శ్రీనివాస్‌ తెలిపారు. అతి తక్కువగా డబుల్‌ ఇండ్లు అందుబాటులో ఉండటం ఎల్‌-2 దరఖాస్తులు 56వేలకు పైగా రావటం చర్చనీయాంశంగా మారింది. పైగా చాలా చోట్ల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఊరికి దూరంగా.. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా ఉండటంతో లబ్దిదారులు వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపించే పరిస్థితి ఉందా అన్న ప్రశ్న అధికారుల్లో వ్యక్తమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -