Friday, June 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలునాలుగోసారీ దాటవేతనే

నాలుగోసారీ దాటవేతనే

- Advertisement -

– సిట్‌ విచారణలో సరైన సమాధానాలివ్వని ప్రభాకర్‌రావు
– రహస్యగోప్యత అంటూ నిజాలు చెప్పని వైనం
– విచారణకు సహకరించట్లేదని సుప్రీం కోర్టుకు తెలపాలనే యోచనలో సిట్‌
– అరెస్టుకు అనుమతించాలని కోరేయత్నం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌

రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావు నాలుగో దఫా విచారణలోనూ దాటవేత ధోరణి అవలంబించినట్టు తెలిసింది. సమాధానాలు రాబట్టడంలో సిట్‌ అధికారులకు నిరాశే ఎదురైనట్టు సమాచారం. గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు సుధీర్ఘంగా సాగిన విచారణలో పలు ప్రశ్నలకు ఆయన నుంచి నేరుగా సమాచారం లభించలేదని తెలిసింది. రెండు రోజుల క్రితం రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి, మరో ఇద్దరు నాయకులు ఇచ్చిన వాంగ్మూలానాలను ఎదుట పెట్టి ఆయన్ను అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. అలాగే, బుధవారం ఈ కేసులో మరో నిందితుడైన డీఎస్పీ ప్రణీత్‌రావు నుంచి సేకరించిన అదనపు సమాచారాన్ని కూడా ప్రభాకర్‌రావుకు తెలిపి వివరణ కోరగా..సిట్‌ అధికారులకు నిరాశే ఎదురైంది. 600కిపైగా ఫోన్‌ నెంబర్లను మావోయిస్టులవిగా చూపించి ట్యాపింగ్‌ చేయడానికి రివ్యూ కమిటీ నుంచి అనుమతి ఎలా తీసుకున్నారనే అధికారుల ప్రశ్నకూ ఆయన సమాధానం చెప్పలేదు. ‘అది ప్రభుత్వ రహస్య గోప్యత. వెల్లడించడం సాధ్యం కాదు. కొన్నింటి విషయాల్లో గోప్యత పాటించడం అనివార్యం’ అంటూ పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేసినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రభాకర్‌రావు ద్వారా ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నెలకొన్న కొన్ని రహస్యాలను బయటకు రప్పించి దీని వెనుక అసలు కుట్రదారుల హస్తాలను బయటకు లాగాలని సిట్‌ అధికారులు చేస్తున్న తీవ్ర ప్రయత్నాలకు మాజీ ఐజీ నుంచి తగిన సహకారం లభించడం లేదని తెలిసింది.
విచారణలో సిట్‌ అధికారులకు పూర్తిగా సహకరించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభాకర్‌రావు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సమాధానాలు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా ప్రభాకర్‌రావు వెల్లడించడం లేదనీ, దీంతో అతన్ని అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరాలనే యోచనలో సిట్‌ అధికారులున్నట్టు తెలిసింది. ఈ మధ్యలో మరోసారి ప్రభాకర్‌రావును ప్రశ్నించాలా? మరికొందరు ప్రముఖుల ఫోన్‌ ట్యాపింగ్‌లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన తర్వాత ముందడుగు వేయాలా? కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను మరోమారు విచారణకు పిలవాలా? అని సిట్‌ బృందం ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -