Saturday, June 21, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపోడు భూముల వివాదం

పోడు భూముల వివాదం

- Advertisement -

ఫారెస్ట్‌ అధికారులకు, పోడుదారులకు మధ్య వాగ్వాదం
కందకాల తవ్వకాలను అడ్డుకున్న వలస గిరిజనులు
నవతెలంగాణ-బూర్గంపాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి ఫారెస్ట్‌ బీట్‌లోని కొసగుంపు వలస ఆదివాసీ గ్రామంలో శుక్రవారం పోడు భూములపై వివాదం చోటుచేసుకుంది. ఫారెస్ట్‌ భూమిలో కందకాలు తవ్వేందుకు వెళ్లిన జేసీబీని ఆదివాసీ మహిళలు అడ్డుకున్నారు. జేసీబీకి అడ్డుగా బైటాయించారు. ఫారెస్ట్‌ అధికారులు మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మహిళలకు, ఫారెస్ట్‌ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. తాము సాగు చేసుకుంటున్న పోడు భూములకు కందకాలు తవ్వొద్దని మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామ పెద్దలతో చర్చించిన తరువాతే కందకాల తవ్వకాలు చేపట్టామని ఫారెస్ట్‌ అధికారులు వివరించారు. ఈ క్రమంలో ఫారెస్ట్‌ అధికారులకు, మహిళలకు మధ్య మాటమాట పెరిగి వివాదంగా మారింది. ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫారెస్ట్‌ అధికారులు తమపై దాడి చేశారని మహిళలు ఆరోపించారు.
ఈ విషయమై అశ్వాపురం ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి రమేష్‌ను వివరణ కోరగా.. కొసగుంపు గ్రామ సమీపంలోని ఫారెస్ట్‌ భూమిలో ప్లాంటేషన్‌ వేసేందుకు ముందుగా కందకాలు తవ్వే పనులు ప్రారంభించా మన్నారు. గ్రామస్తులు, పెద్దలతో రెండు నెలలుగా చర్చించిన తరువాతే సామరస్యంగా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. గ్రామస్తులకు ఎలాంటి ఆర్‌ఎస్‌ఆర్‌ పట్టాలు లేకుండా అటవీ భూములను ఆక్రమిస్తున్న క్రమంలోనే ప్లాంటేషన్‌ వేసేందుకు కందకాలు తవ్విస్తున్నామన్నారు. కానీ, మహిళలు ఫారెస్ట్‌ సిబ్బందిని అడ్డుకుని దుర్భాషలాడారన్నారు. తిరిగి తామే దాడి చేసినట్టు తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఫారెస్ట్‌ అధికారులు తమపై దాడులకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని కొసగుంపు గ్రామానికి చెందిన కొందరు మహిళలు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు, ఎస్‌ఐ రాజేశ్‌కు ఫిర్యాదు చేశారు.
అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి
పోడు సాగుదారులపై అశ్వాపురం రేంజ్‌ పరిధిలోని అటవీశాఖ అధికారులు దాడి చేయడంపై చర్యలు తీసుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పోడు సాగుదారులపై అశ్వాపురం రేంజర్‌ ఫారెస్ట్‌ అధికారులు దాడి చేసి ఆదివాసీ మహిళలను తీవ్రంగా కొట్టారని బత్తుల వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. మహిళలపై దాడి చేసిన వారిపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మడకం సునీత, కుంజా జోగమ్మ, ఎట్టి భీమ్‌, మడకం నందిని, తెల్లం గంగి, తాటి లక్ష్మి, కోస, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -