– ఎటూ తేల్చని రాష్ట్ర ప్రభుత్వం
– అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయం
– ఆ నివేదిక ఆధారంగానే ఫీజు ఖరారు చేసే అవకాశం
– ప్రస్తుతానికి పాత వాటితోనే కౌన్సెలింగ్!
– 3,4 రోజుల్లో షెడ్యూల్ విడుదల
– విద్యార్థుల్లో అయోమయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలతో సంప్రదించి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) నివేదిక ఇచ్చినా ఫీజులను ఖరారు చేయలేదు. దీంతో ఇంజినీరింగ్ ఫీజులపై సందిగ్ధం నెలకొంది. అయితే టీఏఎఫ్ఆర్సీ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు అధికారులతో కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. అప్పుడే ఇంజినీరింగ్ ఫీజులను ఖరారు చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఆలస్యమవుతున్నది. ప్రతిభ గల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు, డీమ్డ్ విశ్వవిద్యాల యాలు, ప్రయివేటు విశ్వవిద్యాలయాల్లో చేరుతు న్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత విద్యాసంవత్స రంలో ఉన్న పాత ఫీజుల ఆధారంగానే ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మూడు, నాలుగు రోజుల్లో షెడ్యూల్ను విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. అయితే షరతులు వర్తిస్తాయని చెప్తున్నారు. ఒకవేళ అధికారుల కమిటీ ఫీజులను పెంచాలని నివేదిక ఇస్తే దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఫీజులను ఖరారు చేస్తే పెరిగిన ఫీజులే అమల్లోకి వస్తాయంటూ షరతు విధిస్తామని అన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి కౌన్సెలింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యామండలి నిర్ణయంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు.
ఫీజులు ఎప్పుడు ఖరారవుతాయో…
రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. గత విద్యాసంవత్సరంలో 1,18,989 సీట్లుంటే, 1,07,160 సీట్లు భర్తీ అయ్యాయి. 2025-26 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు 14 నుంచి తరగతులను ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. దీని ఆధారంగా ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను తయారు చేస్తున్నది. ఇంకోవైపు ఐఐటీల్లో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ తేదీలను దృష్టిలో ఉంచుకుని అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు కాకపోవడం అందరినీ అయోమయానికి గురిచేస్తున్నది. ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులు 2024-25 విద్యాసంవత్సరంతో ముగిశాయి. 2025-26, 2026-27, 2027-28 విద్యాసంవత్సరాలకు సంబంధించి కొత్త ఫీజులు ఖరారు చేయాల్సి ఉన్నది. దీనిపై టీఏఎఫ్ఆర్సీ కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కానీ ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు. అధికారుల కమిటీ వేయాలని నిర్ణయించింది. 2025-26 విద్యాసంవత్సరంలో గత విద్యాసంవత్సరంలో ఉన్న పాత ఫీజులే అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఇంజినీరింగ్ ఫీజులు ఎప్పుడు ఖరారవుతాయోనన్న ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతున్నది. విద్యాసంవత్సరం మధ్యలో ఉత్తర్వులు వచ్చినా వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందో తెలియకుండా చేరెదెలా?అంటూ విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశమున్నది.
కోర్టుకు వెళ్లే ఆలోచనలో కాలేజీలు
ఫీజులను ఇప్పటి వరకు ఖరారు చేయకుండా పాత వాటితోనే కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడితే హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలున్నట్టు తెలిసింది. ఈ విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. ఫీజులు ఖరారు చేయకుండా కౌన్సెలింగ్ నిర్వహించడం సరైంది కాదన్న అభిప్రాయంతో ఉన్నాయి. ఇంకోవైపు టీఏఎఫ్ఆర్సీ ఫీజుల పెంపునకు అంగీకారం తెలిపిన తర్వాత ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోకవడం సమంజసం కాదని చెప్తున్నాయి. ఫీజుల ఖరారుకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ను చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఇంజినీరింగ్ ఫీజులపై సందిగ్ధం?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES