Saturday, June 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి

రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి

- Advertisement -

జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలి : ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
ధర్నాచౌక్‌ వద్ద నిరుద్యోగుల భారీ ధర్నా
బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డిని నిలదీసిన నిరుద్యోగులు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నీలా వెంకటేష్‌ అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద నిరుద్యోగులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. 18 నెలల కాలంలో పలు కోర్టు నోటిఫికేషన్లు కలిపి 60వేల ఉద్యోగాలు కుడా భర్తీ చేయలేదన్నారు. మిగతా ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఇంకా అనేక ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏడేండ్ల కిందట కొత్తగా ఏర్పడిన 23 జిల్లాల ఆఫీసులకు, మండలాలకు, మున్సిపాలిటీలకు పోస్టులు మంజూరు చేయాలని, దాంతో లక్షకు పైగా కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. టీచర్‌ పోస్టుల విషయంలో అన్ని గురుకుల, ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ పాఠశాల నియామకాలను ఒకేసారి ఫలితాలతో ప్రకటించి, ఆప్షన్‌ పద్ధతిని అన్వయించాలని సూచించారు. కొత్త తరాన్ని ప్రభుత్వంలోకి తీసుకొస్తే అవినీతిముక్త పాలన సాధ్యమవుతుందన్నారు. యువత పాలనారంగంలోకి వస్తే ఉత్సాహంతో, అంకిత భావంతో నిజాయితీగా పని చేస్తారని తెలిపారు.
జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారి చేసి అన్ని కేటగిరీల్లో 25 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఖాళీల లెక్కలు లెక్కించే విషయంలో కొందరు అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పాటిస్తున్నారన్నారు ఎంతమంది రిటైర్‌ అయ్యారు? ఎంత మందికి ప్రమోషన్లు వచ్చాయి? కొత్త జిల్లాల ఆఫీసులు రావడం వల్ల ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు? అనే అంశాలపై దృష్టి పెట్టకుండా ఖాళీలు భర్తీ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి, రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి నిరుద్యోగులే కారణమని, అలాంటి వారిని విస్మరించడం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పగిల్ల సతీష్‌, శివ అనంతయ్య, జీలపల్లి అంజి, రాజేందర్‌, రాజు నేత, మోడీ రాందేవ్‌, నిరుద్యోగ నాయకులు జనార్ధన్‌ ,ఇంద్ర, ఆస్మా, ప్రత్యూష ,అర్జున్‌, ఆకాష్‌, శంకర్‌, వంశీ, హరికృష్ణ దామోదర్‌ రెడ్డి, శృతి తదితరులు పాల్గొన్నారు
బీజేపీ ఎమ్మెల్సీకి చేదు అనుభవం
ఈ ధర్నాకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డికి నిరుద్యోగుల నుంచి నిరసన ఎదురైంది. ప్రజాసమస్యలు, నిరుద్యోగుల సమస్యలపై బీజేపీ స్పందించడం లేదని, నిరుద్యోగుల సమస్యలపై తమ వైఖరి తెలిపిన తర్వాతే నిరసనలో పాల్గొనాలని కోరారు. దాంతో అంజిరెడ్డి నిరుద్యోగులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు వినలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -