Sunday, June 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌-పాక్‌ యుద్ధం ఆపినా...

భారత్‌-పాక్‌ యుద్ధం ఆపినా…

- Advertisement -

నాకు నోబెల్‌ శాంతి పురస్కారం వచ్చేదేలే : ట్రంప్‌ వ్యాఖ్య
ఎన్నో ప్రపంచ ఘర్షణలు నివారించానంటూ స్వోత్కర్ష
వాషింగ్టన్‌ :
భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధాన్ని ఆపినంత మాత్రాను తనకు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వరని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. సైనిక చర్చల ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని, అమెరికా మధ్యవర్తిత్వం ప్రసక్తే లేదని రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసినప్పటికీ ట్రంప్‌ పాతపాటే పాడారు. 2026 నోబెల్‌ శాంతి బహుమతికి పాకిస్తాన్‌ తనను నామినేట్‌ చేయడంపై ట్రంప్‌ తన సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌లో స్పందించారు. ‘భారత్‌-పాకిస్తాన్‌ మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వరు. నేను ఏం చేసినా ఆ బహుమతి నాకు రాదు’ అని వ్యాఖ్యానించారు. తన చొరవ, దౌత్యంతో అనేక కీలకమైన శాంతి ప్రయత్నాలు ఫలించాయని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ‘నేను, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కలిసి రువాండా, కాంగో మధ్య ఒక అద్భుతమైన ఒప్పందాన్ని కుదిర్చాము. దీంతో యుద్ధం ఆగిపోయింది. రక్తపాతం, ప్రాణనష్టం జరగకుండా నివారించాం. రువాండా, కాంగో ప్రతినిధులు సోమవారం వాషింగ్టన్‌ వస్తారు. పత్రాలపై సంతకాలు చేస్తారు. ఇది ఆఫ్రికాకు గొప్ప రోజు. స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచానికే గొప్ప రోజు’ అని ట్రంప్‌ తన సుదీర్ఘ పోస్టులో తెలియజేశారు. అమెరికా, ఖతార్‌ మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు రువాండా, కాంగో అంగీకరించాయి. వేలాది మంది మృతికి, నిరాశ్రయులవడానికి కారణమవుతూ దశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఘర్షణలకు తెరదించాలని నిర్ణయించాయి. ‘నేను ఏం చేసినప్పటికీ నోబెల్‌ శాంతి పురస్కారం రాదు. కానీ ప్రజలకు తెలుసు. అది నాకు చాలు. సెర్బియా, కొసావో మధ్య యుద్ధాన్ని ఆపినందుకు నాకు నోబెల్‌ రాదు. ఈజిప్ట్‌-ఇథియోపియా మధ్య శాంతి నెలకొల్పిన ందుకు నోబెల్‌ రాదు. అబ్రహం ఒప్పందాలకూ నేనే కారణం’ అని ట్రంప్‌ తెలిపారు. ఇజ్రాయిల్‌కు, అనేక అరబ్‌ దేశాలకు మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి అబ్రహం ఒప్పందాలను ఉద్దేశించారు. ట్రంప్‌ మొదటి సారి అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలోనే అబ్రహం ఒప్పందాలు కుదిరాయి. కాగా ఇథియోపియాలో డ్యాం నిర్మాణానికి అమెరికా ఆర్థిక సాయం అందించింది. దీంతో నైలు నదికి నీటి ప్రవాహం తగ్గిపోయింది. ‘రష్యా- ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌-ఇరాన్‌ వివాదాలలో ఫలితం ఎలా ఉన్నప్పటికీ నాకు నోబెల్‌ శాంతి పురస్కారం రాదు’ అని ట్రంప్‌ అన్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయం లో ట్రంప్‌ తనను తాను శాంతిదూతగా అభివర్ణించుకున్నారు. ఉక్రెయిన్‌, గాజాలో యుద్ధాలను నిలిపివేయడానికి తన చర్చా కౌశలాన్ని ఉపయోస్తానని చెప్పుకున్నారు. కానీ ఇప్పటికీ అక్కడ ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -