Sunday, June 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణతోనే ప్రమాదాలు

ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణతోనే ప్రమాదాలు

- Advertisement -

– కార్పొరేట్‌ కంపెనీలకు ఏజెంటుగా వ్యవహరిస్తున్న కేంద్రం : టీయూసీఐ జాతీయ అధ్యక్షులు అమ్రిష్‌ పటేల్‌
– నిజామాబాద్‌లో రాష్ట్ర మహాసభ.. కార్మికులతో ర్యాలీ
నవతెలంగాణ-నిజామాబాద్‌ సిటీ

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీల అధిపతులు అదానీ, అంబానీ, టాటాలకు ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని టీయూసీఐ జాతీయ అధ్యక్షులు అమ్రిష్‌ పటేల్‌ అన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర మహాసభ సందర్భంగా శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం నుంచి కలెక్టరేట్‌ వరకు వేలాదిమంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అధ్యక్షత పాత కలెక్టరేట్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ జరిపారు. ఈ సందర్భంగా అమ్రిష్‌ పటేల్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేసేలా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరించి నిరుద్యోగం పెంచుతోందన్నారు. విమానాలు, విమానాశ్రయాలు, నౌకలు, నౌకాశ్రయాలు, రైళ్లు రైల్వేస్టేషన్లు అన్నీ ప్రయివేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తరచూ రైళ్ల ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఓడల్లో మాదకద్రవ్యాల రవాణా ఘటనలు జరుగుతున్నాయన్నారు. కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్‌ కోడ్‌లను, పని గంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఇతర కార్మిక సంఘాలతో ఐక్య కార్యాచరణగా ఏర్పడి కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు.
టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనాలు 26వేలు, కనీస పెన్షన్‌ 9వేలు అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటిత, అసంఘటిత కార్మికులను మోసం చేస్తున్నాయన్నారు. ఈ సభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నరేందర్‌, ఎస్‌ఎల్‌ పద్మ, ఎం.హన్మేష్‌, సహాయ కార్యదర్శి కె.రాజన్న, జి.రామయ్య, సి.వెంకటేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్‌, రాష్ట్ర నాయకులు వెంకన్న, రాజేశ్వర్‌, ముత్తన్న మల్లేష్‌, యాకూబ్‌ షావలి, వెంకట్‌రెడ్డి, అశోక్‌, సాంబశివుడు, కిరణ్‌, ప్రసాద్‌, హనుమంతు, రాజు మరియు ఢిల్లీ, గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఒరిషా, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -