– అవకతవకలపై దర్యాప్తు చేయాలి
– ఎన్టీఏని రద్దు చేయాలి: కేంద్ర విద్యా శాఖ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) కుంభకోణంపై నిగ్గు తేల్చాలని ఎస్ఎఫ్ఐ ఢిల్లీ అధ్యక్ష, కార్యదర్శులు ఐషీ ఘోష్, మయాంక్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, నీట్ పరీక్షల నిర్వహణలో అసమర్థత ప్రదర్శిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఆందోళన జరిగింది. హైదరాబాద్, ఉత్తరాఖండ్, తమిళనాడులోని చెన్నైలో ఆందోళనలు జరిగాయి. ప్లకార్డులు చేబూని నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఢిల్లీ అధ్యక్ష, కార్యదర్శులు ఐషీ ఘోష్, మయాంక్ మాట్లాడుతూ నిష్పక్షపాతంగా పరీక్షలను నిర్వహించాల్సిన ఎన్టీఏ సామర్థ్యం సరిగా లేదని, ఇటీవలి నీట్ స్కామ్, సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)లో పేపర్ లీక్లతో సహా ఏజెన్సీ చుట్టూ పలు వివాదాలు ఉన్నాయని విమర్శించారు. ఈ ఘటనలు విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి, ఆందోళనకు గురిచేయడమే కాకుండా వారి భవిష్యత్తును కూడా ప్రమాదంలో పడేశాయని పేర్కొన్నారు. సురక్షితమైన పరీక్షలను నిర్వహించడంలో ఎన్టీఏ పదేపదే విఫలమవుతున్నందున దానిని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతమైన, పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసంఖ్యాక విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో ఉందని, ఈ క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర విద్యా శాఖ తక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఎన్యూ ఎస్యూ ఉపాధ్యక్షుడు అవిజిత్ ఘోష్ మాట్లాడుతూ ”జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి నీట్ పరీక్షలో ఆరోపించిన అవకతవకలపై స్వతంత్ర, పారదర్శక దర్యాప్తు చేయలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రవేశ పరీక్షల సమగ్రతను కాపాడేందుకు మరింత విశ్వసనీయమైన, సురక్షితమైన పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యా శాఖను డిమాండ్ చేస్తున్నాం” అని అన్నారు. ఎస్ఎఫ్ఐ ఢిల్లీ జాయింట్ సెక్రెటరీ సూరజ్ ఎలామన్ మాట్లాడుతూ ”పదేపదే, ఎన్టీఏ పరీక్షల నిర్వహణలో లోపభూయిష్ట పద్ధతులతో విద్యార్థులకు వెన్నుపోటు పొడిచింది. ఇటీవలి సీయూఈటీ పరీక్షల మధ్య కూడా పరీక్షా కేంద్రాల వద్ద జరిగిన వివిధ వ్యత్యాసాల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడవలసి వచ్చింది. అప్పుడు తగిన చర్యలు తీసుకోలేదు. ఎన్టీఏ అవకతవకలు లేకుండా పరీక్షలను నిర్వహించలేని అసమర్థ సంస్థగా నిరూపితమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ ఎన్టీఏని రద్దు చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలి” అని అన్నారు.