Sunday, June 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే హార్డ్‌డిస్క్‌లను మూసీలో వేశాం

ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే హార్డ్‌డిస్క్‌లను మూసీలో వేశాం

- Advertisement -

సిట్‌ విచారణలో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వెల్లడి
23న తిరిగి ప్రభాకర్‌రావును విచారించనున్న సిట్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు, ఇతర పరికరాలను ధ్వంసం చేసి మూసీ నదిలో వేశామనీ, ఇందుకు మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు ఇచ్చిన ఆదేశాలే కారణమని ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సిట్‌ విచారణలో వెల్లడించాడు. శనివారం ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితుడైన ప్రణీత్‌రావును సిట్‌ అధికారులు ఐదు గంటల పాటు విచారించారు. ఎస్‌ఐబీ కార్యాలయంలో జరిగిన ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారాలన్నీ అప్పటి తమ ఉన్నతాధికారి ప్రభాకర్‌రావుకు తెలుసని డీఎస్పీ వివరించాడు. కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల ఫోన్‌ట్యాపింగ్‌లు చేశారా? అని సిట్‌ ప్రశ్నించగా.. తాము ఏది చేసినా పైఅధికారుల ఆదేశాలతోనేనని ప్రణీత్‌రావు సమాధానమిచ్చాడు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్న సందర్భంలోనే పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎస్‌ఐబీలోని ప్రత్యేక గదిలో ఉన్న ఫోన్‌ట్యాపింగ్‌ పరికరాలు, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేయటం జరిగిందని ప్రణీత్‌రావు చెప్పినట్టు తెలిసింది. ప్రభాకర్‌రావుగాక మరెవరైనా అధికారపార్టీ రాజకీయ ప్రముఖులు ఫోన్‌ట్యాపింగ్‌ చేయాలని ఆదేశించేవారా? అనే ప్రశ్నకు.. తనకు ఎవరూ అలా చెప్పలేదని ప్రణీత్‌రావు అన్నట్టు సమాచారం. తాము ట్యాపింగ్‌ జరిపిన వివరాలను అదనపు ఎస్పీ బుజంగరావుకు అందజేసేవారమని మరో ప్రశ్నకు ప్రణీత్‌రావు సమాధానమిచ్చినట్టు తెలిసింది. మొత్తమ్మీద, ఐదు గంటల పాటు తాజాగా విచారించిన సిట్‌ అధికారులు సోమవారం అవసరమైతే పిలుస్తామని ప్రణీత్‌రావును పంపించివేసినట్టు సమాచారం. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావును 23న తిరిగి విచారణకు హాజరు కావాలని సిట్‌ కోరినట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -