– ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక వర్గ హక్కుల సౌకర్యాల కోసం పోరాటాలకు సిద్ధం కండి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
– మహాసభలో 12 తీర్మానాలు ఆమోదం
నవతెలంగాణ-ఖమ్మం
ఆర్టీసీ కార్మిక వర్గ ఐక్యత పోరాట నినాదమే ఎస్డబ్ల్యూఎఫ్ విధానమని, కార్మికులు ఐక్యంగా పోరాడితేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, ఆర్టీసీ కార్మిక వర్గానికి నష్టం కలిగించే ప్రభుత్వ యాజమాన్య విధానాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడే సంఘం ఎస్డబ్ల్యూఎఫ్ మాత్రమేనని సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఖమ్మంలోని నేపాల్ దేవ్ భట్టాచార్య నగర్, యర్రా శ్రీకాంత్ ప్రాంగణం (ఐఎంఏ హాల్)లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎన్డబ్ల్యూఎఫ్) 4వ రాష్ట్ర మహాసభల రెండో రోజన ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీలో సుదీర్ఘకాలం సాగిన 55 రోజుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యమానికి సీఐటీయూ అండగా నిలిచిందన్నారు. ఆర్టీసీని పరిరక్షించే సాధనం ఐక్యతా పోరాటమే అని, ఆ నినాదం మనదే అని, ఇప్పుడు అందరి నోటా ఐక్యపోరాటాలు వర్ధిల్లాలి అనే నినాదం వస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు అనుభవిస్తున్న కష్టాలు, ఆర్టీసీ ప్రయివేటీకరణ, కాంట్రాక్టీరణ, ఔట్సోర్సింగ్ విధానాలు, ఎలక్ట్రికల్ బస్సులు, పెరిగిన పనిభారాలన్నీ కూడా ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల ఫలితమేనని అన్నారు. కార్మికుల సంక్షేమంగానీ, వేతనాల గురించి గానీ, పని గంటల గురించి గానీ ప్రభుత్వాలు, యాజమాన్యాలు ఆలోచించడం లేదన్నారు. కార్మిక సంఘాలు లేని ప్రపంచం, కార్మిక సంఘాలు లేని భారతదేశం కోసం ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయన్నారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులనే ఎదిరించి పోరాడిన కార్మిక వర్గం భారతదేశంలో ఉందని, ఆ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని, జులై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికవర్గం చేస్తున్న సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మిక వర్గం సంపూర్ణంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ఉమెన్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్వీ రమ మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళల సౌకర్యాల గురించి, మహిళా హక్కుల గురించి చర్చించాలని, శ్రామిక మహిళలకు అండగా నిలవాలని తెలిపారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ కార్యదర్శి అర్ముగనాయర్, ఆంధ్రప్రదేశ్ ఎస్డబ్ల్యూఎఫ్ కోశాధికారి దివాకర్ సౌహార్ధ సందేశమిచ్చారు. అనంతరం 12 తీర్మానాలను మహాసభలో చర్చించి పలు సవరణలతో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆర్టీసీ కార్మికులపై పెంచిన పనిభారాలు తగ్గించాలని, రిటైరయిన కార్మికులకు రావలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు పని ప్రదేశాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని తీర్మానించారు. మహాలక్ష్మి స్కీమ్ నేపథ్యంలో వస్తున్న సమస్యలు పరిష్కరించాలని, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాలకు స్వస్తిపలికి రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ప్రయాణించే విధంగా సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి బస్సు పాసులు మంజూరు చేయాలని మహాసభలో తీర్మానించారు. ఈ మహాసభలో రాష్ట్రంలోని వివిధ డిపోలకు చెందిన 183 మంది ప్రతినిధులు హాజరై కార్యదర్శి నివేదిక తీర్మానాలపై విస్తృతంగా చర్చల్లో పాల్గొన్నారు. మహాసభల జయప్రదం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆహ్వాన సంఘం తరపున సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణ వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. మహాసభల్లో తమ గళం ద్వారా పాటలతో అలరించిన ప్రజానాట్యమండలి బృందానికి, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఏఐఆర్ టీడబ్ల్యూఎఫ్ ఖమ్మం జిల్లా నాయకత్వానికి ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి పిట్టల సుధాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం లింగమూర్తి, ఆర్టీసీ శ్రామిక మహిళ కమిటీ రాష్ట్ర నాయకులు జిల్లా పద్మావతి, ఖమ్మం రీజియన్ అధ్యక్షులు గుండు మాధవరావు, గుగ్గిళ్ళ రోశయ్య, పగిళ్లపల్లి నరసింహారావు, గడ్డం వెంకటయ్య, వి.రమేష్, బుగ్గవీటి లింగమూర్తి, భాగ్యలక్ష్మి, మల్లికాంబ, పద్మ, విజయలక్ష్మి, సరిత, సీతారామారావు పాల్గొన్నారు.
ఎస్డబ్ల్యూఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక
అధ్యక్షులు : వీరాంజనేయులు,
ప్రధాన కార్యదర్శి : వీఎస్ రావు,
ఉప ప్రధాన కార్యదర్శి : లింగమూర్తి
ప్రచార కార్యదర్శి : రవీందర్రెడ్డి
కోశాధికారి : సత్తిరెడ్డి,
సాంస్కృతిక కార్యదర్శి : కృష్ణయ్య
ఉపాధ్యక్షులు : రాంచందర్, ప్రభాకర్, కృష్ణ,
రాంబాబు, జాకబ్, గీత
కార్యదర్శులు : ప్రకాష్, ఎమ్బీ రావు,
ఉపేంద్రచారి, బీ సుధాకర్, పద్మావతి,
పీ సుధాకర్, వీ శ్రీనివాస్
కార్మిక వర్గ ఐక్యతా పోరాటమే ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ విధానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES