– ట్రంప్ దుందుడుకు చర్యలపై వామపక్షాల ఆగ్రహం
– నిరసనలకు పిలుపు
న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా దాడులను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇది ఇరాన్ సార్వభౌమత్వాన్ని, ఐరాస ఛార్టర్ను ఉల్లంఘించడమే అవుతుందని మండిపడ్డాయి. అమెరికా దాడులు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెంచుతాయని, పశ్చిమాసియాను అస్థిరపరుస్తా యని, తీవ్రమైన ఆర్థిక పరిణామాలు సంభవిస్తా యని తెలిపాయి. ఈ మేరకు సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ (ఎం-ఎల్ లిబరేషన్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆర్ఎస్పీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, ఫార్వర్డ్బ్లాక్ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ ఆదివారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేస్తున్నందుకే దాడులు చేశామంటూ అమెరికా, ఇజ్రాయిల్ తమ చర్యను సమర్ధించుకుంటున్నాయి. కానీ ఇక్కడ ఓ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాస్సీ ఈ నెల 19న ఒక ప్రకటన చేస్తూ ఇరాన్ ఓ పద్ధతి ప్రకారం అణ్వాయుధాన్ని తయారు చేస్తోందని చెప్పడానికి తమ వద్ద ఎలాంటి ఆధారం లేదని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేస్తోందని నిర్ధారణకు రావడానికి తమ వద్ద నిర్దిష్ట ఆధారమేదీ లేదని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా అంగీకరిం చాయి. అదీకాక అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై (ఎన్పీటీ) ఇరాన్ సైతం సంతకం చేసింది. వాస్తవాలు ఇలా ఉండగా ఈ నెల 12న ఇరాన్పై ఇజ్రాయిల్ దాడి ప్రారంభించింది. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరగకుండా అడ్డుకునేందుకు ఇజ్రాయిల్ ఈ దాడులు జరుపుతోంది. ఇప్పుడు అమెరికా కూడా ఈ దుందుడుకు చర్యలో ఇజ్రాయిల్తో చేతులు కలిపింది. దౌత్య చర్చలకు రెండు వారాల సమయం ఇస్తున్నానని ప్రకటించి కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాడులు జరిపారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు తమ ఇంటెలిజెన్స్ అంచనాలు, దౌత్య ప్రక్రియలపై పెద్దగా గౌరవం లేదని దీనివల్ల అర్థమవుతోంది. ఇరాన్ పైన, మొత్తంగా దక్షిణాసియా ప్రాంతం పైన యుద్ధాన్ని రుద్దాలని అవి భావించాయి. ఇరాన్ను ధ్వంసం చేయడం, పశ్చిమాసియాపై సామ్రాజ్యవాద ఆధిపత్యం చెలాయించడం, అంతర్జాతీయంగా వనరుల ప్రవాహంపై పెత్తనం చెలాయించడమే దీని వెనుక ఉన్న వాస్తవ ఉద్దేశం. సైనిక, పారిశ్రామిక ప్రయోజనాల కోసమే ఈ దాడి జరిగింది’ అని వామపక్ష పార్టీలు ఆ ప్రకటనలో వివరించాయి.
‘ఇరాన్పై బంకర్ విధ్వంసక బాంబులు వేసేందుకు అమెరికా బీ-2 రహస్య బాంబర్లను మోహరించింది. ఇరాక్ దురాక్రమణ సమయంలో కూడా అమెరికా ఇలాగే దృవీకరించుకోని వాదనలు చేసింది. అవి తప్పని ఆ తర్వాత తేలింది. రెండో ప్రపంచ యుద్ధం చివరలో చర్చలకు జపాన్ సిద్ధపడినప్పటికీ ఇప్పటి వరకూ అణ్వాయుధాలను ఉపయోగించిన ఏకైక దేశం అమెరికాయే. ఇప్పుడు ఆ దేశమే అణ్వాయుధ ముప్పు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఏ విధంగా చూసినప్పటికీ అమెరికా దాడి ఘర్షణలను తీవ్రతరం చేస్తుంది. అంతర్జాతీయ శాంతి పైన, సాధారణ ప్రజల జీవనోపాధి మీద వినాశకరమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చమురు దిగుమతుల కోసం, వలస కార్మికులకు అవకాశాల కోసం పశ్చిమాసియాపై ఎక్కువగా ఆధారపడుతున్న భారత్ వంటి దేశాలపై ఈ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. ఇప్పటికే బాగా ఇబ్బంది పడుతున్న కార్మిక వర్గం ఈ యుద్ధం కారణంగా ఆర్థికంగా మరింత దెబ్బ తింటుంది’ అని వామపక్షాల ప్రకటన తెలిపింది. భారత ప్రభుత్వం వెంటనే అమెరికా, ఇజ్రాయిల్ అనుకూల విదేశాంగ విధాన వైఖరిని విడనాడి యుద్ధాన్ని ఆపడానికి అంతర్జాతీయంగా జరుగు తున్న ప్రయత్నాలలో భాగస్వామిగా చేరాలని వామపక్ష పార్టీలు సూచించాయి. సామ్రాజ్యవాద దురాక్రమణ చర్యకు వ్యతిరేకంగా వెంటనే నిరస నలు చేపట్టాలని పార్టీ శాఖలకు పిలుపునిచ్చాయి. దేశంలో శాంతిని కోరుకునే ప్రజలంతా అమెరికా దాడిని ఖండించాలని కోరాయి.
సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసమే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES