– ఒకరి పరిస్థితి విషమం, 11 మందికి గాయాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట సమీపంలోని వ్యవసాయ కళాశాల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో 11 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి సుమారు 40 మంది ప్రయాణికులతో అశ్వారావుపేట కు వస్తున్న సత్తుపల్లి డిపో ఆర్టీసీ బస్సు, పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి అశ్వారావుపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్ ను వ్యవసాయ కళాశాల సమీపంలో వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఏపీలోని ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుకుంట గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కన్నయ్య తలకు, ఛాతీ భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఏలూరు ఆస్పత్రికి తరలించారు.
బస్సులో ప్రయాణిస్తున్న దమ్మపేటకు చెందిన పగడాల రమాదేవి, అశ్వారావుపేట నందమూరి నగర్కు చెందిన ప్రసన్నలక్ష్మి, కృష్ణవేణి, పేటమాలపల్లికి చెందిన జక్కం రామలక్ష్మి, బాణాల సునీత, కౌలూరి శ్యామల, ఏపీలోని చింతలపూడి మండలం యర్రగుంటపల్లికి చెందిన వల్లెపు శ్రావణి, తొమ్మిదేళ్ల బిందుశ్రీ, ఏడేళ్ల చరణ్రాజ్తో పాటు మరో ఇద్దరు స్వల్ప గాయాలపాలయ్యారు.
గాయపడిన వారిని 108 అంబులెన్సుల ద్వారా అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం, అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



