– టీకాకరణ పనితీరుపై జిల్లా అధికారుల సమీక్ష
– పీ హెచ్ సీ లను సందర్శించిన వైద్యారోగ్య శాఖ అధికారులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
జిల్లా ఉప వైద్య,ఆరోగ్య అధికారి (డై. డీఎంహెచ్వో), జిల్లా బాలల ఆరోగ్య మరియు టీకాకరణ అధికారి (పీఓ-సీహెచ్అండ్ఐ) డా. ప్రతాప్, సీహెచ్వో జి. నాగభూషణం మంగళవారం పట్వారిగూడెం, దమ్మపేట, అశ్వారావుపేట, గుమ్మడవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్సీలు) సందర్శించి నిర్వహించిన ఆశా దినోత్సవం (ఆశా డే) సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, వైద్య సిబ్బందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా సార్వత్రిక టీకాకరణ కార్యక్రమం లక్ష్యాలు, యూ-విన్ నమోదు, డ్యూ లిస్ట్ నిర్వహణ, ఓవర్డ్యూ లబ్ధిదారుల గుర్తింపు, హెచ్పీవీ టీకాకరణ, కోల్డ్ చైన్ నిర్వహణ, టీకా సెషన్ల నాణ్యత, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు.
అనంతరం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారీగా టీకాకరణ పనితీరును సవివరంగా సమీక్షించారు. యూ-విన్లో పెండింగ్ నమోదులు, ఓవర్డ్యూ లబ్ధిదారులకు టీకాల అందజేత, సెషన్ నిర్వహణ, డ్యూ లిస్ట్ ధృవీకరణతో పాటు ఇతర ఇమ్యునైజేషన్ సూచికలను పరిశీలించారు. పనితీరు సూచికలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలకు సూచించారు.
జిల్లాలో సార్వత్రిక టీకాకరణ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి అర్హత కలిగిన గర్భిణి, తల్లి మరియు చిన్నారికి సకాలంలో టీకాలు అందేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.



