నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 99 అర్జీలను,జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 54 వ్యవసాయ శాఖ 17, జిల్లా గ్రామీణ అభివృద్ధికి,6,జిల్లా పంచాయతీ శాఖ 5, సర్వే లాండ్స్ 4, జిల్లా పరిషత్ 4, మున్సిపాలిటీ 2,జిల్లా వైద్య ఆరోగ్య 2,ట్రాన్స్కో, జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా అటవీ శాఖ, ఆర్ అండ్ బి , ఎంప్లాయిమెంట్ ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, వన మహోత్సవం , సీజనల్ వ్యాధులు, ఎరువులు, భూ భారతి, ఆయిల్ ఫామ్ సాగు వంటి వాటి పై కలెక్టర్ సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగు పై రైతులకు అవగాహన కల్పించి, పంటలు వేసుకునేలా చూడాలన్నారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులందరూ తమ శాఖలకు సంబంధించిన పనుల పై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.