– స్కూటీని ఢీకొట్టిన టిప్పర్
– నుజ్జునుజ్జయి అక్కడికక్కడే బాలుడు మృతి
నవతెలంగాణ-నిజాంపేట్/దుండిగల్
తల్లితో కలిసి స్కూటీపై పాఠశాలకు బయలుదేరిన బాలుడు టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల క్షణాల్లో ప్రాణం కోల్పోయాడు. స్కూటీని టిప్పర్ ఢీకొీట్టడంతో టైర్ల కింద నలిగిపోయింది ఆ పసివాడి ప్రాణం. శరీరం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందాడు. రెప్పపాటులో విగతజీవిగా మారిన కొడుకును చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఈ విషాద ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేటలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ పట్టణానికి చెందిన రాజు భార్య, కుమారుడు అభిమన్యురెడ్డి (6), కుమార్తెతో కలిసి మల్లంపేటలోని ఆకాష్ లేఅవుట్లో నివసిస్తున్నాడు. అభిమన్యురెడ్డి స్థానిక గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే ఉదయం తల్లి బాలుడిని స్కూటీ ముందు భాగంలో కూర్చోబెట్టుకొని పాఠశాలకు బయలుదేరింది. మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో పల్లవి మోడల్ హైస్కూల్ వద్దకు రాగానే వెనుక నుంచి టిప్పర్ ఢకొీట్టింది. దాంతో తల్లీకొడుకులు కింద పడిపోయారు. లారీ టైర్ ఆ పిల్లాడి తలపై నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. తన కండ్ల ముందే రక్తపు మడుగులో విలవిల్లాడి ప్రాణం పోయిన కొడుకును చూసి తల్లి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. నిర్లక్ష్యంగా టిప్పర్ను నడిపి బాలుడి మృతికి కారకుడైన డ్రైవర్ను దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం
ఈ ప్రమాదంతో బాలుని తల్లి షాక్కు లోనయ్యింది. ప్రమాదం ఎలా జరిగిందో.. ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో కింద పడిన పిల్లాడిని వెంటనే ఒళ్లోకి తీసుకుని బోరుమంది. విగతజీవిగా ఉన్న బాలుడిని పొత్తిళ్లలో పొదిమి పట్టుకుని గుండెలు పగిలేలా కన్నీరు పెట్టింది. కాసేపట్లోనే అక్కడకు చేరుకున్న తండ్రి ఆ పసికందును చూసి కన్నీరుమున్నీరయ్యాడు.
టిప్పర్ టైర్ల కింద నలిగిన బాలుడు
- Advertisement -
- Advertisement -